ఏపీ కేబినేట్ నిర్ణయాలు.. విద్యార్ధులకు గుడ్ న్యూస్..

ఎల్జీ పాలిమర్స్ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమను తొలగించాలని ఏపీ కేబినేట్ ఆదేశించింది. ఆ భూముల్లో పర్యావరణ అనుకూల, ప్రమాద రహిత పరిశ్రమను నెలకొల్పేందుకు ఎల్జీ పాలిమర్స్ యజమాన్యానికి అనుమతులు మంజూరు చేసింది. అలాగే మైనార్టీ సబ్‌ప్లాన్ ఏర్పాటుకు కూడా కేబినేట్ ఆమోదముద్ర వేసింది. ఇవాళ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటి జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు కేబినేట్ ఆమోదం తెలిపింది.

రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నియామకానికి సంబంధించిన చట్ట సవరణను సైతం ఏపీ కేబినేట్ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం సంస్థ సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి 10 వేల మెగా వాట్ల సౌర విద్యుత్ పొందేందుకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే వ్యవసాయ వినియోగానికే 10 వేల మెగావాట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. యూనిట్‌కు రూ. 2.49కు సరఫరా చేసేలా కేబినేట్ ఆమోదం తెలిపింది.

అటు ఆర్&బికి చెందిన ఖాళీ స్థలాలు, భవనాలను ఆర్డీసీకి బదలాయించడానికి కేబినెట్ ఆమోదించింది. రూ. 30.79 కోట్లతో మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ సహకారంతో 1.62 లక్షల మంది విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇవ్వనుంది. రాష్ట్రంలోని 300 కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లల్లో 40 సర్టిఫికేషన్ కోర్సుల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది.