సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ప్రస్తావించాలి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలువరించడానికి సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ముఖ్య వేదికగా ఉపయోగపడుతుందని జనసేన భావిస్తోంది. ఆదివారం తిరుపతిలో జరిగే ఈ సమావేశంలో విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే భావోద్వేగంతో ఈ స్టీల్ ప్లాంట్ ఏ విధంగా ముడిపడి ఉందో, 32 మంది ప్రాణ త్యాగాలతో ఈ పరిశ్రమను ఎలా సాధించుకున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియచేయాలి. ఈ అవకాశాన్ని శ్రీ జగన్మోహన్ రెడ్డి సద్వినియోగపరచుకోవాలి.

సేలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలువరించేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనుసరించిన విధానాన్ని కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. అక్కడ అన్ని పక్షాలతో తమిళనాడు ప్రభుత్వం చర్చించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూసేందుకు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతగా ముందుకురావాలని జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.