వైసీపీ భూ కబ్జాలకు పేదలు బలవుతున్నారు

• ఒంటిమిట్ట మండలంలో చేనేత కార్మికుడు శ్రీ సుబ్బారావు కుటుంబం మరణాలపై సమగ్ర విచారణ చేపట్టాలి
ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో భూ రికార్డులు మార్చిన క్రమంలో చేనేత కార్మికుడు శ్రీ సుబ్బారావు కుటుంబం మరణించడం పలు సందేహాలు కలిగిస్తోందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. వైసీపీ నాయకులు చేస్తున్న భూ దందాలకు పేదలు బలైపోతున్నారు. చేనేత మగ్గం నడవక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి భూమి మీద హక్కులు లేకుండా చేసేశారు. ఆ కుటుంబానికి చెందిన ఆస్తి వైసీపీ నాయకుల పేరు మీదకు ఎలా మారిపోయిందీ, సామూహిక మరణాలకు కారకులెవరో సమగ్ర విచారణ చేపట్టాలి. వైసీపీ పాలకులు ప్రజల ఆస్తులు హస్తగతం చేసుకొనేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువచ్చింది. అంతే కాదు ఆస్తులు రిజిస్ట్రేషన్ తరవాత కనీసం దస్తావేజులు కూడా ఇవ్వకుండా కేవలం ఫోటోస్టాట్ కాపీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం కూడా వైసీపీ భూదందా కుట్రలో భాగమే అనిపిస్తోంది. అధికార పదవుల్లోని ముఖ్య నాయకులు భారీగా దోచేస్తుంటే స్థానికంగా ఉన్న నాయకులు పేదల భూములు గుంజేస్తున్నారు. వీటిని చట్టపరం చేసేందుకే చట్ట సవరణలు, కొత్త చట్టాలు తీసుకొచ్చారు. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడంతోపాటు భూ దందాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జనసేనాని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *