‘తవాస్మి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన నివాసంలో ‘తవాస్మి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రచయిత ఈ పుస్తకంలో రామాయణం ద్వారా జీవన నైపుణ్యాలను పెంచుకో నే అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. “శ్రీరాముడి గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఆయన్ను ఒక పాలకుడిగా, ఒక మనిషిగా భావించి ఆయన జీవితాన్ని పరిశీలించాలన్నారు. ఒక వ్యక్తిగా, రాజుగా, తనయుడిగా, అన్నగా, భర్తగా. ఇలా ఎక్కడా కూడా ధర్మం తప్పకుండా మనిషి ఎలా జీవించాలో చూపిన వాడే శ్రీరాముడని ఆయన అన్నారు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అని రాముడి మాటలను గుర్తు చేశారు. “జన్మభూమిని మించిన స్వర్గము మరొకటి ఉండదని దానర్థం. ఉపాధి అవకాశాల కోసం ఏ దేశమేగినా.. నీకు జన్మనిచ్చిన దేశాన్ని సుసంపన్నం, సుభిక్షం చేసుకోవడానికి నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని రామావతారం బోధిస్తుంది” అని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు భాషాభిమానులు పాల్గొన్నారు.