సహజ వనరుల దోపిడీలో వైసీపీ కొత్త రికార్డులు సృష్టిస్తోంది

• నెల్లూరు జిల్లాలో వేల కోట్ల విలువైన క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు• అక్రమ మైనింగ్ ఆపకుంటే జనసేన – టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణ
నెల్లూరు జిల్లా.. అధికార పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డాగా మారిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు ఒక ప్రకటనలో విమర్శించారు. సహజ వనరుల దోపిడీలో వైసీపీ నాయకులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. విలువైన క్వార్ట్జ్ లాంటి ఖనిజాల తరలింపును అనధికారికంగా అధికార పార్టీ నేతలు కొల్లగొడుతున్న తీరు, మైనింగ్ ముసుగులో పేదలను భయాందోళనలకు గురి చేస్తున్న విధానం విస్మయం కలిగిస్తోంది. జిల్లాకు చెందిన అధికార పార్టీ మంత్రి కనుసన్నల్లో నిత్యం కోట్లాది రూపాయిల విలువైన క్వార్ట్జ్ రాయి రాష్ట్ర సరిహద్దులు దాటిపోతోందని, అధికారగణం అంతా ఈ విషయాన్ని చూసీచూడనట్లుగా వదిలేస్తోందని ఉమ్మడి నెల్లూరు జిల్లా సమావేశాల సందర్భంగా స్థానిక జనసేన నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారు. అధికార బలంతో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా వందలాది ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలను కనీసం గనుల శాఖ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం, పోలీసు శాఖలు అడ్డుకోకపోవడం దురదృష్టకరం. క్వార్ట్జ్ రాయి లోపల ఉండే సిలికా పదార్థానికి చైనా, తైవాన్ వంటి దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఈ మైనింగ్ పై గత కొన్ని నెలలుగా వైసీపీ నేతల కన్ను పడింది. నెల్లూరు జిల్లా సైదాపురం, కలువాయి, పొదలకూరు, గూడూరు, రాపూరు మండలాల్లో ఈ దోపిడీ విపరీతంగా ఉంది. మైనింగ్ కోసం భూములు ఇవ్వమని తెగేసి చెప్పేవారిపై పోలీసు కేసులుపెట్టడం, దాడులకు తెగబడడంతో ఆయా ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దోపిడీలో ప్రభుత్వ పెద్దలకూ వాటాలు చేరడం వల్లే యంత్రాంగం చూసీ చూడనట్టు వదిలేస్తున్నట్టు అర్థం అవుతోంది. హైకోర్టు స్టే ఇచ్చినా దోపిడీ నిరంతరాయంగా సాగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వైసీపీ రాజ్యాంగం మినహా ఈ అక్రమ మైనింగ్ కి ఎలాంటి చట్టాలు, నిబంధనలు వర్తించవన్న విషయం మరోసారి రుజువయ్యింది. గత మూడు నెలల్లో సుమారు రూ. 4 వేల కోట్ల విలువ చేసే ఖనిజం సరిహద్దులు దాటించేశారు. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ పై తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలియచేస్తుంది. అక్రమ మైనింగ్ పై సంబంధిత అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోకుంటే జనసేన – టీడీపీ కలసి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం. సహజ సంపదను భవిష్యత్తు తరాల కోసం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని శ్రీ నాగబాబు స్పష్టం చేశారు.