సుహృద్భావపూర్వకంగా సాగిన సమావేశం

* ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ
గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి విశాఖపట్నంలో సమావేశమయ్యారు. ఈ భేటీ సుహృద్భావంగా ప్రేమపూర్వకంగా సాగింది. సుమారు 40 నిమిషాల పాటు వారి మధ్య సమావేశం సాగింది. ఈ భేటీపై పవన్ కళ్యాణ్ సంతృప్తిగా ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో శ్రీ నరేంద్ర మోదీ గారితో జరిగిన సమావేశమంత ప్రభావశీలంగా ఈ సమావేశం ఉందని పార్టీ నాయకులతో చెప్పారు. విశాఖ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి, తెలుగు ప్రజల ఐక్యత గురించి చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య విషయాలను పవన్ కళ్యాణ్ కూలంకషంగా వివరించారు. యువత అభ్యున్నతికి అవసరమైన ఆర్థికాభివృద్ధి రాష్ట్రానికి ఎంత అవసరమో పవన్ కళ్యాణ్ ప్రధాన మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.