దిక్సూచిలా… జనసేన ప్రస్థానం పుస్తక సంకలనాలు

2014 మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ సభ నుంచి 2022 మార్చి 14న ఇప్పటంలో నిర్వహించిన ఆవిర్భావ సభ వరకూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలు, వెల్లడించిన అభిప్రాయాలను పుస్తక రూపంలో సిద్ధం చేసింది పార్టీ మీడియా విభాగం. ఏడు వాల్యూమ్స్ లో ఉన్న ఈ పుస్తకాలను గురువారం సాయంత్రం హైదరాబాద్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందచేశారు. ఆయన మాట్లాడుతూ “ఈ పుస్తకాలు నాకు ఎంతో ఆశ్చ్యర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. పార్టీ ఎదుగుదలను తెలియచేసేలా ఏడు సంకలనాలతో కూడిన జనసేన ప్రస్థానం పుస్తకాలు ఉన్నాయి. ఈ ప్రయాణంలో జనసేన పార్టీ ఎంతగా ప్రజలతో మమేకమైంది, ప్రజా సేవకు చిత్తశుద్ధితో అంకితమైంది తెలియచేస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను తెలియచెప్పిన అభిప్రాయాలూ, ప్రజా సమస్యలు, రాజకీయ, సామాజిక అంశాలపై చేసిన ప్రసంగాలను అక్షరబద్ధం చేయడం పార్టీ శ్రేణులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఇవి నాకు ఒక దిక్సూచిలా ఉన్నాయి. ప్రతి జిల్లాల్లో మాట్లాడినవి… స్థానిక సమస్యల నుంచి, రాష్ట్ర స్థాయిలో సమస్యల వరకూ ఏ విధంగా స్పందించామో ఈ పుస్తకాలు తెలియచేస్తున్నాయి” అన్నారు. ఈ సందర్భంగా పార్టీ మీడియా విభాగంలోని సభ్యులకు పేరుపేరునా అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్, మీడియా విభాగ ప్రతినిధులు చక్రవర్తి, ఎల్.వేణుగోపాల్ పాల్గొన్నారు.