జిల్లా కేంద్రంలో క్యాన్సర్‌ ఆసుపత్రి మంజూరు చేయాలి

విజయనగరం: జిల్లా కేంద్రంలో క్యాన్సర్‌ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఆదివారం మయూరి కూడలిలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ దీక్ష చేపట్టారు. దీనికి జనసేన నేత గురాన అయ్యలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ క్యాన్సర్‌ ప్రాణాంతక రోగమని, దీని బారిన పడినవారు ఇళ్లు, ఒళ్లు గుళ్ల చేసుకుని వైద్యం చేయించుకున్నా, చివరకు ప్రాణాలు నిలుపుకోలేక పోతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రోగులు విశాఖ వెళ్లి వైద్యం చేయించుకోలేక అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. విజయనగరంలో ప్రభుత్వమే క్యాన్సర్‌ ఆసుపత్రిని ప్రారంభిస్తే, ఈ ప్రాంత ప్రజలతో పాటు శ్రీకాకుళం, ఒడిశా వాసులకు కూడా ఎంతో ఉపయోగపడుతుందన్నారు.