రెపరెపలాడిన వంద అడుగుల జెండా

జనసేన పార్టీ పదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 100 అడుగుల భారీ జెండాను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం ఆవిష్కరించారు. శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించిన అనంతరం మీట నొక్కి జెండాను ఆవిష్కరించారు. భారీ జెండా ఆవిష్కరణతో కార్యాలయం నూతన శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “జనసేన పార్టీ జెండా ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుంది. జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభకు కనీవినీ ఎరుగని విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభకు పోలీస్ శాఖ అనుమతి కూడా వచ్చింది. వారికి పార్టీ తరఫున ధన్యవాదాలు. ఈ రోజు సాయంత్రం గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని కలిసిన అనంతరం మరోసారి ఏర్పాట్లు పరిశీలించి ఏవైనా మార్పులు ఉంటే వెంటనే సరి చూసుకుంటాం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే జన సైనికులు, వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పి.ఎ.సి. సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, నగర అధ్యక్షులు తదితర నాయకులు పాల్గొన్నారు.