నావిక్ రెండో తరం ఉపగ్రహాలతో సరికొత్త సమాచార విప్లవం

* దేశీయ పరిజ్ఞానంతో ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రోకు అభినందనలు
భారతదేశ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో మొదటి ఎన్వీఎస్–1 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ -12 వాహన నౌక ద్వారా సోమవారం విజయవంతంగా ప్రయోగించి, కక్షలోకి ప్రవేశపెట్టడం భారతీయులుగా గర్వించదగిన విషయమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో సంతోషం వ్యక్తం చేశారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిన భారతదేశపు అంతరిక్ష పరిశోధన కేంద్రం ప్రగతిని చూసి గర్వపడే క్షణాలివి. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ లో అధునాతన సాంకేతికతతో రూపొందించిన నావిక్ రెండో తరం ఉపగ్రహాలు భారతదేశ అంతరిక్ష పరిశోధన కీర్తి పతాకలో మరో కలికితురాయి. ఎల్ 1 సిగ్నల్స్ ను పంపే రెండో తరం నావిక్ ఉపగ్రహాలు నావిగేషన్ వ్యవస్థలో కచ్చితమైన సమాచారాన్ని పంపేందుకు ఉపయోగపడతాయి. ఇవి భవిష్యత్తు సమాచార విప్లవంలో కొత్త పుంతలు తొక్కిస్తాయనడంలో సందేహం లేదు. ప్రయోగంలో పాలు పంచుకున్న ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ఇస్రో పురోభివృద్ధి కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్న వారందరికీ నా తరఫున, జనసేన పార్టీ తరఫున హార్దిక శుభాకాంక్షలు అని జనసేనాని పేర్కొన్నారు.