తెలుగు ప్రజలను ఆదిపరాశక్తి చల్లగా చూడాలి

* భారతీయులందరికీ విజయదశమి శుభాకాంక్షలు
“దుర్గాం దేవీమ్ శరణమహం ప్రపద్యే”… అని పఠిస్తూ ఆది పరాశక్తిని పూజిస్తున్న శరన్నవరాత్రులు విజయదశమిలోకి ప్రవేశిస్తున్న శుభ తరుణాన తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. నవరాత్రులు ప్రవేశించిన రోజు నుంచి ఇప్పటి వరకు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భక్తిప్రపత్తులతో ఓలలాడుతున్నాయి. నవ దుర్గలకు ప్రణామంగా నవ బతుకమ్మల వేడుకలతో తెలంగాణ రాష్ట్రమంతా పూల పరిమళాలు వ్యాపించడం సంతోషాన్ని కలిగించింది. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన పూజలు సద్దుల బతుకమ్మతో ముగింపు దశకు చేరుకొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విరాజిల్లింపజేస్తున్నాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ అంతటా గౌరీ దేవీ పూజలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శోభనిచ్చే అమ్మవారి అలంకారాలు ఆదిశక్తి ఆలయాలకు కొత్త కళను తెచ్చాయి. లక్షలాది మంది భక్తులు కనకదుర్గమ్మవారిని సందర్శించుకోవడం నవరాత్రుల యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తున్నాయి. తెలుగు ప్రజలు సుఖశాంతులతో విలసిల్లాలని, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిపథాన పయనించేలా ఆ పరమేశ్వరి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ విజయ దశమి పర్వదినాన నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.