Putalapattu: జనసైనికులను ప్రశంసించిన బిజెపి నేత

చిత్తూరు జిల్లా చీకూరిపల్లి (బంగారుపాళ్యం), మీ అందరి సమిష్టి కృషే విజయానికి సోపానం అని చీకూరిపల్లి
గ్రామస్థులను, జనసైనికులను బీజేపీచిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు పోతపాల రామమూర్తి ప్రశంసించి, అభినందించారు. మంగళవారం బంగారుపాళ్యం మండల జడ్పీటీసీ ఎన్నికల సరళి గురించి జనసేనపార్టీ నాయకులు పుంగనూరు నానబాల లోకేష్ రాయ్, ఆవుల శాంతమూర్తి, నెహ్రూ రాయల్, దుర్గాప్రసాద్ రాయల్, కిషోర్ రాయల్ లతో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంకోసం ధర్మం కోసం జనసేనపార్టీ, బీజేపీ కలసి పనిచేస్తున్నాయని చెప్పారు. ఇక ముందు రానున్న కాలంలో కూడా జనసేనపార్టీతో మాత్రమే మైత్రీబంధం కొనసాగుతుందని కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా తెలిపారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో సైతం రాష్ట్రంలో మొట్టమొదటి సర్పంచ్ గా ఎన్నికైన చీకూరి అమరావతిని, ఆమె విజయానికి కృషి చేసిన జనసైనికులను, గ్రామస్థులను కలసి అభినందించారు. ఇదే ఐక్యతను ఇంకా బలంగా చాటుకుని మండలంతోపాటు జిల్లాలో యువత ఏకతాటిపైకి వచ్చి బీజేపీ, జనసేనపార్టీలను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ శక్తి వంచనలేకుండా కృషి చేయాలన్నారు. పూతలపట్టు నియోజవర్గానికే ఆయువుపట్టుగా బంగారుపాళ్యం మండలాన్ని నిలపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు, చీకూరిపల్లి గ్రామస్థులు పాల్గొన్నారు.