చైతన్యమూర్తి శ్రీ పూలే

అవిభక్త భారతదేశంలో అంటరానితనం, అణచివేత, సామాజిక రుగ్మతలపై పోరుసల్పిన తొలినాటి యోధుడు శ్రీ జ్యోతిరావు పూలే. సామాజిక ప్రజాస్వామ్యం అనే నినాదాన్ని ఎలుగెత్తి చాటి అటువంటి ప్రజాస్వామ్యం కోసం కలలుగన్న గొప్ప సంఘ సంస్కర్త శ్రీ పూలే. నేడు ఆ మహానుభావుని జయంతి. ఆయన సేవా నిరతి, అణగారిన వర్గాల పట్ల ఆయనకున్న అవాజ్యమైన ప్రేమాభిమానాలను మననం చేసుకుంటూ ఆ మార్గదర్శికి ప్రణామాలు అర్పిస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. శతాబ్దం కాలం నాడు ఆచార వ్యవహారాలు, కుల వ్యవస్థతో కూడిన ఛాందస భావాలు తీవ్రంగా ఉండేవి. అటువంటి పరిస్థితులలో కాలానికి, సమాజానికి ఎదురెళ్లి సమాజంలో అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, ఐకమత్యం కోసం పాటుపడిన ధీశాలి శ్రీ పూలే. ఆడబిడ్డలకు చదువు ఎంతో ముఖ్యమని నమ్మి వారి విద్యాభివృద్ధికి అహరహం శ్రమించిన గొప్ప సంస్కర్త. వితంతువుల బిడ్డలు అనాథలు కాకూడదని నమ్మి వారికి అండగా నిలబడిన నిస్వార్ధ సేవకుడు. పూలు అమ్మే చిరు వ్యాపారిగా జీవితం ప్రారంభించి రచయితగా, తొలితరం స్వతంత్ర యోధునిగా, కార్మిక ఉద్యమ నేతగా, రైతు బాంధవునిగా ఆయన ప్రజాజీవితం అజరామరం. నేటి రాజకీయ పక్షాలు సైతం ఆయన చూపిన సామాజిక న్యాయం, సామాజిక ప్రభుత్వం అనే మార్గంలో పయనించడం ఆయన దార్శనికతకు, ముందు చూపునకు తార్కాణం. జనసేన మూల సిద్ధాంతాలలో ఒకటైన ‘కులాలను కలిపే ఆలోచనా విధానం’ శ్రీ జ్యోతిరావు పూలే ఆలోచనలకు దగ్గరగా ఉండే సూత్రం. ఆ మహనీయుని అడుగుజాడలలో జనసేన ప్రస్థానం కొనసాగుతుందని ఈ సందర్బంగా ఉద్ఘాటిస్తూ నా పక్షాన, జనసేన శ్రేణులు పక్షాన ఆ చైతన్యమూర్తికి అంజలి ఘటిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.