గంగాధర శాస్త్రికి అభినందనలు

ప్రముఖ గాయకులు, స్వరకర్త శ్రీ ఎల్.వి.గంగాధర శాస్త్రి గారికి మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో మహర్షి పాణిని సంస్కృత ఏవమ్ వేదిక్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. వారికి నా హృదయపూర్వక అభినందనలు. గంగాధర్ పాత్రికేయులుగా ఉన్నప్పటి నుంచీ నాకు పరిచయం. భగవద్గీత వైశిష్ట్యాన్ని నేటి తరానికి అర్థమయ్యేలా చెప్పడంతోపాటు… గీతాసారం వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో అందరికీ తెలియచేయడంలో భగవద్గీత ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది. భగవద్గీతలోని 700 శ్లోకాలను ఆలపించి, అర్థాన్ని విడమరచి చెప్పేందుకు శ్రీ గంగాధర్ చక్కటి ప్రయత్నం చేశారు. హైందవ ధర్మం, భారతీయ సంస్కృతి పరిరక్షణకు తపించే ఆయన భవిష్యత్తులో ఇదే బాటలో విజయవంతంగా పయనిస్తూ మరిన్ని ప్రశంసలు, పురస్కారాలు అందుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.