ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం చేతగాని ప్రభుత్వం పేదల పక్షమా?

• ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ఇక్కట్ల పాలయ్యేది పేదలే
• పేదలపై ప్రేమ ఉంటే బటన్ నొక్కి అరోగ్యశ్రీకి నిధులు ఇవ్వాలి

వైసీపీ పాలకుల అసమర్థ ఆర్థిక నిర్వహణ వల్ల ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా వైద్యం చేసే నెట్వర్క్ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 కోట్లు బకాయిపడింది. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఆసుపత్రుల నిర్వాహకులు అనేకమార్లు ప్రభుత్వాన్ని కోరినా సరిగా స్పందించలేదు. అరకొరగా నిధులు ఇచ్చి పేదలకు వైద్యం చేయిస్తున్నాం అని మభ్యపెట్టే ప్రయత్నాలే ప్రభుత్వం వైపు నుంచి ఉన్నాయి. బకాయిలు చెల్లించకపోతే వైద్య సేవలు కొనసాగించలేమని నెట్వర్క్ ఆసుపత్రులు గత నెలలోనే తేల్చి చెప్పినా ప్రభుత్వం స్పందించలేదు. ఇదేనా పేదల పక్షం ఉన్నామని గొప్పలు చెప్పుకొనే వ్యక్తి పాలన. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ఇక్కట్ల పాలయ్యేది పేదలే అని తెలుసుకోవాలి. ఈ ముఖ్యమంత్రికి నిజంగా పేదలపై ప్రేమ ఉంటే బటన్ నొక్కి నిధులు ఇచ్చి, ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోకుండా చూసేవారు. చిత్తశుద్ధి ఉంటే బటన్ నొక్కి ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వాలి. ఈ పరిస్థితి ఉత్పన్నం కాబోతుందని జనసేన పార్టీ పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆరోగ్యశ్రీకి నిధుల కేటాయింపు సక్రమంగా లేదు, ఆసుపత్రులకు బకాయిలు చెల్లించడం లేదు, ఫలితంగా పేదలు ఇబ్బందిపడతారు అని పదేపదే చెప్పాం. అయినా పాలకుల చెవికెక్కలేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం ప్రతిపక్షాలను విమర్శిస్తూ కాలం వెళ్ళ బుచ్చుతూ అదే పాలన అనుకొనే ముఖ్యమంత్రి ముందుగా ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.