బత్తలపల్లిలో శ్రీ కలుగురి రామకృష్ణ కుటుంబానికి ఓదార్పు

సాగు నష్టాలు, ఆర్ధిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కలుగురి రామకృష్ణ కుటుంబాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో ఆయన ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చారు. పార్టీ తరఫున రూ. లక్ష  ఆర్థిక సాయాన్ని ఆయన భార్య శ్రీమతి నాగలక్ష్మికి అందజేశారు. కుటుంబానికి పార్టీపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రామకృష్ణ కుమారుడు, మహేష్ మాట్లాడుతూ.. “12 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాళ్లం. పంటనష్టం, చేసిన అప్పులు తీర్చలేక మా నాన్న గారు అన్నంలో పురుగుల మందు కలుపుకొని తిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మా తండ్రి చనిపోయి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా మా ఇంటికి రాలేదు. కానీ మీరు వస్తున్నారని తెలియగానే మా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేశారని ఫోన్ చేసి మరీ చెబుతున్నార”ని చెప్పారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారితోపాటు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ తదితరులు పాల్గొన్నారు.