సచిన్ టెండూల్కర్ కు కరోనా పాజిటివ్‌

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్‌ చేసి చెప్పారు. తేలిక పాటి లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టు చేయించుకున్నానని.. ఈ రోజు పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు. అయితే తన ఇంట్లో అందరికీ నెగెటివ్‌ వచ్చిందని తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తాను ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా తనకు చికిత్స అందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఇదిలా ఉండగా, సచిన్‌ ఇటీవల రోడ్‌సేఫ్టీ సిరీస్‌ ఆడిన సంగతి తెలిసిందే. గతేడాది ప్రారంభమైన ఈ టోర్నీ అప్పట్లో లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడింది. తిరిగి ఈ నెలలో ప్రారంభమైన సందర్భంగా భారత లెజెండ్స్‌ ఇతర జట్లను ఓడించింది. ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి సచిన్‌ టీమ్‌ ట్రోఫీని ముద్దాడింది. ఇది జరిగి వారం కూడా గడవకముందే సచిన్‌కు కరోనా సోకడం గమనార్హం.