ఏపీ సచివాలయంలో కరోనా టెన్షన్.. 60 మందికి పాజిటివ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. సచివాలయ ఉద్యోగుల్లో కరోనా టెన్షన్ నెలకొంది. ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో, మిగతా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఈ 60 మందితో పాటు వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు తేలింది. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న వి పద్మారావు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో సచివాలయంలో నిన్న 200 మంది ఉద్యోగులకు కొవిడ్ టెస్టులు నిర్వహించారు. ఆ ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికైనా వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.