ఆనం రాంనారాయణ రెడ్డి ప్రాణ రక్షణ బాధ్యత డీజీపీ తీసుకోవాలి

•శాసనసభ్యులే ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయి
వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ ఆనం రాంనారాయణ రెడ్డి గారు తనకు ప్రాణ హాని ఉందని ఆందోళన చెందటం చూస్తుంటే రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరాయనిపిస్తోందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం, హుందా అయిన రాజకీయ నాయకుడిగా పేరున్న శ్రీ ఆనం రాంనారాయణ రెడ్డి గారే ఆందోళన చెందుతున్నారు అంటే మిగిలిన ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఏమిటి? శాసనసభ్యులే ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయి. మేం నెల్లూరులో ఉన్నప్పటి నుంచి ఆనం కుటుంబంతో పరిచయం ఉంది. ప్రభుత్వ వ్యవహార శైలి గురించీ, తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం గురించీ శ్రీ రాంనారాయణ రెడ్డి గారు తన అభిప్రాయాలు వెల్లడించడమే నేరం అని ప్రభుత్వ పెద్దలు భావించినట్లున్నారు. ఆయనకు కేటాయించిన రక్షణ సిబ్బందిని సైతం తగ్గించారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకొని శ్రీ రాంనారాయణ రెడ్డి గారి ప్రాణ రక్షణ బాధ్యతను రాష్ట్ర డీజీపీ తీసుకోవాలి. ఆయనకు తగిన రక్షణ ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో రాష్ట్ర డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోమ్ శాఖకు లేఖ రాసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని తెలియపరుస్తాను. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రాణ భయంతో ఉన్నారు. అలాగే స్వేచ్ఛగా మాట్లాడుకొనే పరిస్థితి కూడా లేదు. సొంత ఎమ్మెల్యేలపైనే నిఘాలు, ఫోన్ సంభాషణలు దొంగ చాటుగా వినడం పాలకుల అభద్రతా భావాన్ని తెలుపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నేరుగా సీఎం, ఆయన కార్యాలయంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తే బాధ్యత కలిగిన డీజీపీ, హోమ్ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడటం లేదు? శ్రీ రాంనారాయణ రెడ్డి గారు చేసిన ప్రాణ హాని ప్రకటన, శ్రీ శ్రీధర్ రెడ్డిగారు చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.