వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన ఎన్నికల వ్యూహం

•వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హానికరం
•ఢిల్లీ మద్యం మాఫియాలో వైసీపీ నాయకులున్నారని కేంద్ర మంత్రే చెప్పారు
•అధికారం చూడని అన్ని వర్గాలను కలుపుకొనిపోతాం
•ముందుగా మా పార్టీలో లోపాలు సరిదిద్దుకుంటాం
•పార్టీలో ఉండి పార్టీకి హాని చేస్తే సహించం
•త్వరలో పార్టీ కోసం క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేస్తాం
•పార్టీలో ఏ స్థాయి వ్యక్తులు తప్పు చేసినా నిర్దాక్షణ్యంగా సస్పెండ్ చేస్తాం
•జనసేన పీఏసీ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

‘వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున ‘వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్’ ఉండాలని కోరుకుంటున్నాం.. ఆ దిశగానే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ వ్యూహాలు ఉంటాయి.. అందుకోసం ఎవరితో కలవాలి.. ఏం చేయాలి.. అప్పటి పరిస్థితులను బట్టి ఆలోచిస్తాం’ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఇప్పటి వరకూ అధికారం చూడని అన్ని వర్గాలను కలుపుకొని అడుగులు వేస్తామని అన్నారు. వ్యూహాన్ని సందర్భాన్ని బట్టి చెబుతామని.. సందర్భాన్ని బట్టి వ్యూహం మారుతూ ఉంటుందని.. ఏ వ్యూహం వేసినా అంతిమ లక్ష్యం మాత్రం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే. మా ముఖ్య ఉద్దేశం.. లక్ష్యం అదే అన్నారు. సోమవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “వ్యూహం అనేది చెప్పేది కాదు… కాలాన్ని, పరిస్థితిని బట్టి పరిణామక్రమం చెందేది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ప్రకటిస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ గారు ప్రకటించారు. సోనియా గాంధీ గారి ఇంటికి కుటుంబంతో వెళ్లి మరీ మనస్ఫూర్తిగా కలిపేస్తానని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక వచ్చిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. చివరి వరకు వ్యూహం పరిణామ క్రమంలో ఉంటుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తామని కానీ, చేయమని కానీ ఇప్పుడు చెప్పలేము. మునుముందు ఎలాంటి పరిస్థితులు వస్తాయో వాటిని బేరీజు వేసుకొని ముందుకు వెళ్తాం. ప్రధాని మోడీ గారు టీడీపీని రానివ్వరు, చంద్రబాబును కలవరు అన్నారు… మొన్న ఇద్దరు కలిశారు కదా. ఢిల్లీలో బయటపడిన మద్యం మాఫియాలో చాలా మంది వైసీపీ నాయకులు ఉన్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గారే చెప్పారు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది? ఎవరెవరూ లోపలకు వెళ్తారో ఇప్పుడే చెప్పలేం. జరుగుతున్న పరిణామాలను బట్టి వ్యూహం ఉంటుంది. వ్యూహం అనేది ప్రజలు గెలవడానికి వేస్తాను. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేలా, యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా, రాయలసీమ, ప్రకాశం జిల్లాల నుంచి వలసలు ఆగేలా జనసేన పార్టీ వ్యూహం ఉంటుంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అనే మాటకు కొనసాగింపే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్.
•జాతీయ స్థాయిలో రాష్ట్రం స్థాయి చూపాలి
వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హానికరం. తెలంగాణ నాయకుల చేత ఆంధ్రా నాయకులు ఛీ కొట్టించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో రాజధాని లేదు. అయినా ఎవ్వరికీ సిగ్గు లేదు.. పౌరుషం రాదు.. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టాలి. జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిని చూపించాలి. ఇప్పటికీ కొద్ది మందే అధికారం కోసం కొట్టుకుంటున్నారు. ఆ కొద్ది మంది వ్యక్తుల సమూహం వల్ల రాష్ట్రం నిష్ప్రయోజనం అయిపోయింది. నేను సగటు కుల నాయకుడిలా మాట్లాడలేను. ఆ కొద్ది మంది వారి కులాలు, వర్గాలను వాడుకుని ఉండొచ్చు. వారి వల్ల రాష్ట్రం నిష్ప్రయోజనం అయిపోయింది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఎస్సీ, ఎస్టీ వర్గాలను, ఇఫ్పటి వరకు అధికారం చూడని వర్గాలను, బీసీలను, బలిజ, కాపు, ఒంటరి, తెలగ కులాల దగ్గర నుంచి రెడ్డి, కమ్మ సామాజికవర్గాలను కలుపుకుని ముందడుగు వేయాలి.
•జనసేనలో ఉన్నది ప్రజాస్వామ్యం.. కులస్వామ్యం కాదు
దీనిలో భాగంగా సెప్టెంబర్ నుంచి మా పార్టీ నిర్మాణంలో లోపాలు సరిదిద్దుకునే పనిని ముందుకు తీసుకువెళ్తాం. మా పార్టీ నాయకులకు ఒక్కటే చెబుతున్నాం ఉంటే సంపూర్ణంగా జనసేనలో ఉండండి. పక్కనే ఉంటూ సోషల్ మీడియాలో మాట్లాడితే ఎవ్వరిపైనైనా చర్యలు తీసుకుంటామని సమావేశంలో బలంగా చెప్పాం. పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేస్తాం. ఐదు నుంచి ఏడుగురు సభ్యులతో నా అధ్యక్షతనే ఆ కమిటీ ఏర్పాటు చేస్తానని చెప్పాను. 2009లో కూడా డబ్బు తీసుకున్నారని చాలా మందిపై అపవాదులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు జనసేనకు వస్తే.. అది నా దృష్టికి వస్తే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని సమావేశంలో చెప్పాము. మేము ఆంధ్రప్రదేశ్ బాగు కోసం వచ్చాం. సొంత పార్టీలో ఎవరు తప్పు చేసినా నిర్ధాక్షణ్యంగా పార్టీలో నుంచి వెళ్లిపొమ్మని చెబుతున్నాం. బయటి శత్రువుని కొట్టడం నాకు తేలిక. ఆ శత్రువు బయటికి కనిపిస్తాడు. పక్కనే ఉండే అనుకూల శత్రువుతో కష్టం. ఇష్టం ఉంటేనే జనసేనతో నడవమని చెప్పాము. పెద్ద పెద్ద నాయకులు ఎవరూ లేకుండానే ఏడు శాతం ఓటు సాధించాం. పార్టీ నడపలేరని అపవాదుని మూటకట్టుకుని కూడా ఇక్కడి వరకు పార్టీని తీసుకువచ్చాను. రాజకీయ ప్రస్థానంలో 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టాం. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పార్టీని ముందుకు తీసుకువెళ్తాం. జనసేనలో ఉన్నది ప్రజాస్వామ్యం. కులస్వామ్యం కాదు. ఒక కులమే ఓన్ చేసుకుంటానంటే కుదరదు. శ్రీ కాన్షీరాం గారు ఏర్పాటు చేసిన బీఎస్పీ కూడా.. ద్వేషించిన బ్రాహ్మణులతోనే చేతులు కలపాల్సి వచ్చింది. జనసేన ఆవిర్భావం నుంచి స్పష్టంగా ఉన్నాం. ఆంధ్ర ప్రదేశ్ బాగుండాలంటే అన్ని కులాలూ బాగుండాలి. ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించి ముందుకు వెళ్లే పరిస్థితులు లేవు. పార్టీలో ఇబ్బంది ఉంటే ఎవరైనా బయటికి వెళ్లిపోవచ్చని చెప్పాం. ఈసారి గతం మాదిరి తప్పులు చేయం. ఆ క్రమశిక్షణతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉండాలని కోరుకుంటున్నాం. రాష్ట్రాన్ని సరిదిద్దబోయే ముందు మా పార్టీలో ఉన్న లోటుపాట్లు సరిదిద్దుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ని ఒక అద్భుత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.కొన్ని వారాలుగా జనవాణి, జనసేన కౌలు రైతు భరోసా యాత్రల్లో చాలా కొత్త సమస్యలు, బాధలు, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు మా దృష్టికి వచ్చాయి. ఈ రోజు పీఏసీలో మాట్లాడిన మాటల్లో 2008 నుంచి మేం చేసిన ప్రయాణం. రాజకీయ ప్రస్థానంలో ఏం చూశాం.. ఏం చేయకూడదు.. మేం ఏమి నేర్చుకున్నాం.. ఎలాంటి వ్యక్తులు పార్టీలో ఉంటే ఏం జరుగుతుంది.. తప్పులు ఉంటే ఎలా సరిదిద్దుకోవాలి అనే అంశాలు కూలంకషంగా చర్చించాం. రాజకీయాల్లో ఒకసారి దెబ్బతిన్న తర్వాత జనసేన ఆవిర్భావానికి ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అభివృద్ధికి దూరం అయిపోతోంది. రాజధాని లేని రాష్టంగా మారిపోయింది. 14కు పైగా బీసీ కులాలకు తెలంగాణలో గుర్తింపు లేకుండా పోతోంది. రాజధాని లేక పెట్టుబడులు రాకుండా పోతున్నాయి.
•బెదిరిస్తే బెదిరిపోయేవాళ్లం కాదు
నేను ఒకరు గెలిస్తే చూసి అసూయ పడే వ్యక్తిని కాదు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు, 25 మందికి పైగా ఎంపీలు ఉన్నప్పుడు పాలన అద్భుతంగా ఉంటుందని భావించాం. రాష్ట్రాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్తారని అనుకున్నాం. వారికి సంబంధించిన వ్యక్తులు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే.. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటామని చెప్పాం. అదే ఈ రోజు వరకు పాటిస్తూ వచ్చాం. నిన్న రాయలసీమ యాత్రలో కడప జిల్లాకు వెళ్తున్నామంటే.. అన్ని సామాజిక మాధ్యమాలు, ప్రసార సాధనాల్లో యాత్ర ఎలా సాగుతుంది. జనసేన వాళ్లను తిరగనిస్తారా లాంటి వార్తలు చూస్తే.. ఇలాంటి ఆలోచనా ధోరణి చూసి రాయలసీమలోకి.. కడపలోకి ఎవరూ అడుగు పెట్టలేరు. ముఖ్యంగా కోస్తా ప్రాంతం నుంచి వచ్చిన నాయకులు ఎవరూ అక్కడ అడుగుపెట్టలేరన్న భయాన్ని కలిగించే భావన కొన్ని దశాబ్దాలుగా కలిగించారు. జనసైనికులు, వీర మహిళలు, మా పార్టీ నాయకులకు అలాంటి భయాలు లేవు. జాతీయభావాలతో పెరిగిన వాళ్లం. మనుషులంతా సమసమాజం కావాలని కోరుకునే వాళ్లం. మాకు ఒక ప్రాంతం ఎక్కువ కాదు. ఒక ప్రాంతం తక్కువ కాదు. ఒక ప్రాంతంలోని వ్యక్తులు బెదిరిస్తే బెదిరిపోయేవాళ్లం కాదు. నేను చూసింది.. మిగతా పెద్దలతో మాట్లాడింది.. రాయలసీమ నుంచే అత్యధిక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఈ రోజుకీ రాయలసీమ ఎందుకు వెనుకబడి ఉంది అనే అంశమే. ఆ ప్రాంతంలో వేల ఎకరాల భూములు, మైన్స్ ఉన్నాయి. యువత మాత్రం ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. యువత ఉపాధి అవకాశాలు కల్పించమని అడుగుతున్నారు. కొద్ది మంది రాయలసీమ నాయకులు రాయలసీమ వెనుకబడి పోయిందనే నినాదం మీదే బతుకుతారు. వెనుకబాటుని పారద్రోలడానికి ఏం చేయాలో చెప్పరు.
•సెటిల్మెంట్ కల్చరే రాష్ట్ర విభజనకు కారణం
తెలంగాణలో ఆంధ్రా వాళ్లు దోచేస్తున్నారన్న భావన రావడానికి అలాంటి సెటిల్మెంట్ కల్చరే కారణం. దీని దుష్ఫలితం ఆంధ్ర ప్రజలు మొత్తం అనుభవించారు. సిద్ధవటం లాంటి చోట్ల పచ్చటి పొలాలు.. రైల్వే కోడూరు లాంటి చోట్ల తోటలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో చక్కటి విద్యా సంస్థలు ఉన్నాయి. అయితే అవన్నీ రాజకీయ నాయకుల చేతిలో ఉన్నాయి తప్ప ప్రజల చేతిలో లేవు. రాయలసీమ నుంచి వచ్చిన నాయకులు కోస్తాంధ్రలో స్థలాలు కొని పెట్టుబడులు పెడతారు. దేశం నుంచి గాని మిగతా రాష్ట్రం నుంచి ఎవ్వరూ వెళ్లి రాయలసీమకు పెట్టుబడులు ఎందుకు పెట్టలేరంటే అక్కడ కొద్ది మంది నాయకులు పడనివ్వరు. ఏ పరిశ్రమ వచ్చినా కప్పం కట్టాలి. రాయలసీమలో పరిశ్రమ స్థాపించాలంటే కప్పం కట్టాలి. అది ప్రభుత్వానికి కాదు. ఆ ప్రాంతంలో ఆధిపత్యం ఉన్న వ్యక్తులకు కట్టాలి. కప్పం కట్టకుంటే కియా లాంటి మల్టీనేషనల్ ఫ్యాక్టరీ మీద దాడి చేసినట్టు చేస్తారు. అలాంటప్పుడు మిగతా రాష్ట్రం నుంచి వెళ్లి అక్కడ పరిశ్రమలు స్థాపించాలంటే సాధ్యపడే విషయమేనా? పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు లేనంత వరకు రాయలసీమ వెనకబడే ఉంటుంది. దానికి కారణాలు ఏంటి? అభివృద్ధి కేవలం కొద్ది మంది చేతుల్లోనే ఉండిపోయింది. ఆ పరిస్థితులు పోవాలంటే రాయలసీమ రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలి.
•ఆ సైనికుడి మాటలు బాధించాయి
తిరుపతి జనవాణిలో కశ్మీర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ లో పని చేసే రెడ్డి ప్రసాద్ అనే సైనికుడు శెలవు పెట్టుకుని మరీ వచ్చి తన రెండు ఎకరాలు కబ్జా చేసేశారని చెప్పారు. మిలటరీలో అధికారులు భారత భూబాగంలోకి ఎవరైనా అడుగుపెడితే కాల్చేయమని చెబుతారు. నేను నా మాతృ భూమిని కాపాడుతుంటే.. నాకున్న రెండెకరాలు అక్కడున్న స్థానిక నాయకులు లాగేసుకున్నారు. నేనెవరికి చెప్పాలని బాధపడ్డారు. ఆయన చెప్పిన మాటలు ఆవేదన కలిగించాయి. వ్యవస్థలు పని చేయడం మానేశాయి.
•ఆ ప్రభుత్వంలో అందరి పదవులు అలంకారప్రాయమే
కోస్తాంధ్రలో దళితులు, వెనుకబడిన తరగతులకు గొంతెత్తి చెప్పుకునే అవకాశం ఉంది. రాయలసీమలో గొంతెత్తి చెప్పడానికి కూడా అవకాశం లేదు. కొద్ది మంది నాయకులు ఓపెన్ గానే చెబుతారు- ఇది మా ఇలాకా.. మా ఆధిపత్యాన్ని వదులుకోం అని. రాయలసీమలో అత్యధికంగా బీసీలు ఉన్నారు.. యాదవులు, పద్మసాలీలు, దేవాంగులు ఉన్నారు. బలిజ కులాలు, ఉపకులాలు ఉన్నాయి. ముస్లిం తెగల్లో దూదేకులు ఉన్నారు. ఇంత మంది ఉన్నా ఎక్కువ మంది బయటకు రాలేకపోతున్నారు. యువత బయటకు వచ్చి ఈ పరిస్థితులు మారాలని కోరుకుంటున్నాను. అలా మారాలంటే అలంకార ప్రాయమైన పదవులు కాకుండా ఆ పదవికి న్యాయం చేయగలిగే పరిస్థితులు ఉండాలి. ఇప్పుడు ఎవరికి హోం మంత్రి ఇచ్చినా అది అలంకారప్రాయంగానే ఉంది. పదవితో పాటు సెక్యూరిటీ ఇస్తారు. నిర్ణయాలు తీసుకునే అధికారం మాత్రం వారికి ఉండదు.
•మేనిఫెస్టోలో దివ్యాంగులకు ప్రత్యేక స్థానం
2008లో ప్రారంభించిన రాజకీయ ప్రస్థానంలో అధికారం చూడని కులాలకు అధికారం రావాలనుకున్నాం. ఆ రోజు నిలబెట్టుకోలేకపోయాం… ఇప్పుడు ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం.. దీని కోసం అధికారం చూడని కులాల్లో యోగ్యత ఉన్న వ్యక్తుల్ని గుర్తించే విధంగా పార్టీ విధానం ఉండాలని పీఏసీలో నిర్ణయం తీసుకున్నాం. ఎస్సీ స్మశాన వాటికలు, మైనారిటీల స్మశాన వాటికలు, వక్ఫ్ బోర్డు ఆస్తులు కబ్జాలు పెట్టేస్తుంటే ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. జనవాణిలో కడప నుంచి వచ్చిన మైనారిటీ నాయకులంతా మా ఆస్తులు కాపాడండి మేం మిమ్మల్ని నమ్ముతున్నామన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ, వెనకబడిన ముస్లింల ఆర్ధిక పరిపుష్టి కోసం ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు శ్రీ మందకృష్ణ మాదిగ దివ్యాంగుల మీటింగ్ పెట్టారు. అప్పుడు ఇంత మంది ఉన్నారా అనిపించింది. ఆ రోజున అంతా విమర్శించారు ఆయన్ని. వారు నన్ను కలిసినప్పుడు కులం కంటే వివక్షతో మమ్మల్ని చూస్తున్నారు అని చెప్పిన మాటలు బాధ కలిగించాయి. సీపీఎఫ్ పెట్టినప్పుడు వారికి ఏదో చేయాలనిపించింది. రెండు, మూడు వేల ఫించన్లు ఇవ్వడం కాదు. వారికి ఏం చేయాలనే ఆలోచనతో మేనిఫెస్టోలో దివ్యాంగులకు ప్రత్యేక స్థానం ఉండాలని నిర్ణయించుకున్నాం. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన వైసీపీని జనం నమ్మారు. జనం నా వెంట వచ్చినా ప్రజలు ఓటు వైసీపీకే వేశారు. అధికారంలోకి రాగానే భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారు. 32 మంది ఆత్మహత్యలకు కారకులయ్యారు. ఓడిపోయిన మూడు నెలల్లో రోడ్ల మీదకు రావాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సమస్యలు వస్తూనే ఉన్నాయి. వైసీపీ సృష్టించిన సమస్యలు ఒక స్థాయిలో ఉన్నాయి. సీపీఎస్ రద్దు, ఫీజు రీఎంబర్స్ మెంటు అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద అప్పుల కుప్పలు పెట్టేశారు. మనం ఎంత డబ్బు సంపాదించినా సగటు మనిషి మీద ఆ అప్పుల ప్రభావం ఉంటుంది. ధరలు పెరిగిపోతాయి. అప్పుల్ని చూపించి సౌభాగ్యం అంటే ఎలా? వాహన మిత్ర పథకం కింద ఏడాదికి రూ. 10 వేలు ఇచ్చి రూ. 16 వేలు తీసేసుకుంటున్నారు. టాక్సులు, ఫిట్మెంట్ రూపంలో ఆ రూ. 16 వేలు తీసేసుకుంటున్నారు. డ్రైవర్లు మాకు ప్రయోజనం లేదంటున్నారు. ఫీజు రీఎంబర్స్మెంటు, విదేశీ విద్యాదీవెన లాంటి పథకాలు అమలు కావడం లేదు. మైనారిటీ విద్యావిధానం లేదు. పీజీ హాస్టల్స్ తీసేశారు. అన్ని వర్గాలకూ అన్యాయం చేశారు.
•పాదయాత్ర చేసినోళ్లు అందరూ వినోబా భావేలు కాలేరు
పాదయాత్ర చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి… అధికారానికి అదే “కీ” అంటే నమ్మను కానీ.. పాదయాత్రను పరిగణనలోకి తీసుకుంటాను. పాదయాత్రలు చేసిన వాళ్లు అందరూ వినోబా భావేలు కాలేరు… ఆంధ్ర థానోస్ కూడా అవుతారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏ పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు? ఆయన నాలుగు గోడల మధ్య కూర్చొని వ్యూహం వేస్తే ముఖ్యమంత్రి అయ్యారు. ఏ పాదయాత్ర చేశారని మహారాష్ట్రకు షిండే ముఖ్యమంత్రి అయ్యారు. చాలా జరుగుతాయి. పరిస్థితికి తగ్గట్టు వ్యూహాం మార్చుకుంటూ ముందుకు వెళ్లడమే. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎక్కువ పార్టీలు పోటీ చేయాలని కోరుకునే వాడిని. బీజేపీతో జనసేన భాగస్వామిగా ఉన్నా.. జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ. దీన్ని ఎవరూ కాదనలేం. ప్రత్యామ్నాయాలు ఉంటేనే దేశానికి, రాష్ట్రానికి మంచిద”ని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *