భీమవరంలో శుద్ధమైన తాగునీరు కూడా అందివ్వలేక పోతున్నారు

* అబద్ధపు హామీలతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు
* దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల దాహార్తి తీర్చడంలో లేదు
* జనసేన ప్రభుత్వంలో ప్రతీ పైసా ప్రజా ప్రయోజనాలకే ఉపయోగిస్తాం
* భీమవరం “వర్చువల్” సమావేశంలో జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు

భీమవరం నియోజకవర్గంలో ప్రజలకు అసత్యపు హామీలిచ్చిన నాయకులు కనీసం శుద్ధమైన త్రాగునీరు, వ్యవసాయానికి సరైన సాగునీరు కూడా అందించలేక పోతున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు స్పష్టం చేశారు. భీమవరం నియోజకవర్గం జనసేన కార్యవర్గంతో సోమవారం “వర్చువల్” సమావేశం ద్వారా శ్రీ నాగబాబు గారు మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గం బాధ్యులు శ్రీ కొటికలపూడి గోవిందరావు (చినబాబు) నేతృత్వంలో నాయకులు, వివిధ కమిటీల సభ్యులు, క్రియాశీలక కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు త్రాగునీరు, సాగునీటి కొరత, ముందుకు సాగని మంచినీటి పథకాలు, నెరవేరని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, డంపింగ్ యార్డు సమస్య, డ్రెయినేజీలు మురుగుకూపం, 100 పడకల ఆసుపత్రి కడతామని ఇచ్చిన హామీ ఇంకా నెరవేర్చకపోవడం తదితర సమస్యలను జనసేన కార్యవర్గం శ్రీ నాగబాబు గారు దృష్టికి తీసుకు వచ్చారు. ఆయా సమస్యలకు శ్రీ నాగబాబు గారు స్పందిస్తూ వైసీపీ నాయకులకు దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల దాహార్తి తీర్చడంలో లేదని, అబద్ధపు హామీలతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టే పరిస్థితుల్లో లేరని అన్నారు. రాష్ట్రంలో మద్యం సరఫరా చేస్తున్నంత సులువుగా మంచినీరు అందించలేక పోతున్నారని చెప్పారు. జనసేన ప్రభుత్వంలో ప్రతీ పైసా ప్రజా ప్రయోజనాలకే ఉపయోగిస్తామని నాగబాబు గారు స్పష్టం చేశారు.