పార్టీ హై కమాండ్ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలి

ప్రియమైన జనసేన పార్టీ జనసైనికులకు, వీర మహిళలకు, NRI విభాగం SAVVE సభ్యులకు, జనసేన పార్టీని ముందుకు తీసుకొని వెళ్లేందుకు మీరు అంకితభావంతో చేస్తున్న కృషికి, సహాయ సహకారాలకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. గత దశాబ్ద కాలంలో మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఉన్నతమైన నాయకత్వంలో, బలమైన భావజాలంతో.. సమాజంలో గణనీయమైన మార్పులు తీసుకునివచ్చింది. మన అధినేత తీసుకున్న ప్రతీ నిర్ణయం కూడా పార్టీని బలంగా ముందుకు తీసుకొని వెళ్ళటం కోసం, మన రాష్ట్రం, దేశంలోని భావి తరాలకు ఉజ్వల భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో ఉంటాయి. అధ్యక్షుల వారు అన్ని వైపుల నుండి ఆలోచించి, వివిధ అంశాలపై నిర్దిష్టమైన వ్యూహాత్మక విధానాన్ని కలిగి ఉంటారు. బాహ్య ఒత్తిళ్ళను ఎదుర్కోవడానికి పార్టీ స్థిరంగా ఉంటుంది. కొన్ని నిర్ణయాలు కొంతమంది వ్యక్తులకు స్వల్పకాలిక వ్యక్తిగత ఇబ్బందులకు గురి చేయవచ్చు. కానీ అంతిమంగా ఈ నిర్ణయాలు రాష్ట్ర, దేశ ఉన్నతమైన ప్రయోజనాలకు మేలు చేసే విధంగా తీసుకోబడ్డాయి.
ప్రతీ ఒక్క సభ్యుడు కూడా పార్టీ హై కమాండ్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. మనం అందరం కూడా పార్టీ కంటే ఎక్కువ కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అలాగే పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించము అని ప్రతిజ్ఞ చేయాలి. అలాగే దయ చేసి మీరు సోషల్ మీడియాలో కానీ బహిరంగంగా కానీ తోటి సభ్యులతో వ్యక్తిగత గొడవలకు దిగటం, అవమానకరంగా ప్రవర్తించడం కానీ చేయవద్దు అని కోరుతున్నాము. పార్టీ ప్రతిష్టకు, సమగ్రతకు భంగం కలిగేలా ప్రవర్తించిన వారు ఎవరైనా సరే వారిపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుంది. ఈ విషయంలో జనసేన పార్టీ జీరో టోలరెన్స్ విధానం అవలంభిస్తుంది. పార్టీని బలపరిచేందుకు అన్ని NRI జనసేన విభాగాలు కలిసికట్టుగా పని చేయాలని, పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగు వేయాలని మనస్పూర్తిగా ప్రోత్సహిస్తున్నాము. మనందరం కలిసికట్టుగా, ఐకమత్యంతో పార్టీని ముందుకు తీసుకెళ్లదాం. మీరందరూ అంకితభావంతో చేస్తున్న నిరంతర సేవలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
శ్రీ కె.నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి