ఏపీ డీఎస్సీ-2018 అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌..

ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ-2018 అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఉపాధ్యాయ నియామకాల ఉత్తర్వులను ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఏపీ విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ మంగళవారం వెల్లడించారు. రెండేళ్ళ క్రితం ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ రాసిన అభ్యర్థులు ఇప్పటికీ పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

డీఎస్సీ 2018కి సంబంధించి కోర్టుల్లో వివాదం వల్ల చాలా పోస్టులను భర్తీ చేయలేదని మంత్రి సురేశ్‌ తెలిపారు. హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 3,524 ఉపాధ్యాయ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే 2,203 మంది అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తి అయ్యిందని, మిగిలిన 1,321 మంది అభ్యర్థుల వెరిఫికేషన్ మంగళవారం సాయంత్రానికి పూర్తి చేశామని ఆయన వివరించారు.

సెప్టెంబర్ 24వ తేదీన ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని.. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను కూడా అదే రోజున అభ్యర్థులకు తెలియజేస్తామని మంత్రి తెలిపారు. అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్న మంత్రి.. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించి.. అదే రోజుల్లో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లను అందిస్తామన్నారు.

ఎస్జీటీ పోస్టులు భర్తీ అయ్యాక న్యాయస్థానం ఆదేశాల ప్రకారం మిగిలిన పోస్టులు భర్తీ చేస్తామని, ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్, వ్యాయామ ఉపాధ్యాయులు, ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి సురేశ్ తెలిపారు. సెప్టెంబర్ 28లోపు నియామక ప్రక్రియను పూర్తి చేసి అర్హులకు నియామక పత్రాలు అందిస్తామన్నారు.

పెండింగ్‌లో ఉన్న వాటిని పూర్తి చేశాక డీఎస్సీ 2020 నిర్వహిస్తామని ఆయనన్నారు. టెట్ పరీక్ష విధి విధానాలు రూపొందించామని.. టెట్ సిలబస్‌ను ఆధునీకరించి పరీక్షను నిర్వహిస్తామని మంత్రి సురేశ్‌ స్పష్టం చేశారు.