ఉమెన్స్ డే సందర్భంగా ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సెలవు..

అభివృద్ధిలో మహిళలది అత్యంత కీలక పాత్రని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8, 2021 న రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ సెలవు దినంగా ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

పురుషుడితో నేడు అన్ని రంగాల్లో పోటీపడుతూ మహిళా తన ప్రతిభను చాటుకుంటున్నదన్నారు. జనాభాలో సగంగా వున్న మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు. వారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ , వృద్ధ మహిళలు , ఒంటరి మహిళలు , వితంతువులకు పింఛన్లు , కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ , కేసీఆర్ కిట్ , అంగన్ వాడీ , ఆశా వర్కర్లకు వేతనాల పెంపు సహా మహిళా సాధికారత కేంద్రంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు . ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మహిళా సంక్షేమంలో ముందంజలో ఉందని సీఎం తెలిపారు.