హెలీకాప్టర్లలో తిరుగుతూ ప్రభుత్వాన్ని ముందుకెలా తీసుకెళ్తారు?

• ఈ ప్రభుత్వ అసమర్ధత తారా స్థాయికి చేరింది
• పంచాయతీలను దివాళా తీయించారు… వైసీపీ సర్పంచ్ శ్రీమతి ధనలక్ష్మి ఆత్మహత్యే తార్కాణం
• డీఎస్పీల బదిలీలే వైసీపీకి తెలిసిన పాలన
• వెలిగొండ కోసం శ్రీ వైవీ ఇప్పుడు పాదయాత్ర చేయాలి
• విమర్శలు చేసే వ్యవసాయ మంత్రి రైతుల కోసం రూ. వెయ్యి ఖర్చు చేశారా?
• రాష్ట్ర హితం కోసమే పొత్తులు
• జనసేన పార్టీ స్వార్ధ రాజకీయాలకు దూరం
• ఒంగోలులో మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

హెలీకాప్టర్లో తప్ప రోడ్డు మీద తిరగలేని ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ నిధులను మళ్లించి దివాళా తీయించింది అన్నారు. సొంత డబ్బు ఖర్చు చేసి పనులు చేసిన అధికార పార్టీ సర్పంచ్ శ్రీమతి ధనలక్ష్మి ఆర్థిక ఒత్తిళ్లతో ఆత్మహత్య చేసుకుందంటే ఇదా మీ పరిపాలన? ప్రభుత్వ అసమర్ధత తారా స్థాయికి చేరిందన్నారు. అకాల వర్షాలకు నాలుగున్నర లక్షల ఎకరాల పంట నష్టపోతే ప్రతి గింజా కొంటామన్న ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారో తెలియడం లేదన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే ఇప్పటి వరకు నిర్మించలేని ప్రభుత్వం ప్రకాశం జిల్లాను అంధకారంలోకి నెట్టేసిందన్నారు. కోస్తా జిల్లాల ఇంఛార్జ్ గా ఉన్న శ్రీ వైవీ సుబ్బారెడ్డి వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటూ ఇప్పుడు మళ్లీ పాదయాత్ర చేయాలన్నారు. జనసేన పార్టీ అవకాశవాద, స్వార్ధ రాజకీయాలకు దూరంగా ఉంటుందని తెలిపారు. అధికారంలోకి రాక ముందు ఒకలా.. వచ్చాక మరోలా భాష మార్చి మాట్లాడదన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ ఆవుల వెంకట ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి, రూ. 5 లక్షల చెక్కు అందచేశారు. ఆదివారం ఒంగోలులో నిర్వహించిన ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “జనసేన పార్టీ మండల స్థాయి, పట్టణ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నిర్మాణం పూర్తి చేసుకుని ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా మొన్నటి కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మార్గనిర్ధేశం చేశారు. పార్టీపరంగా భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేపట్టినా రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజలకు అండగా నిలబడే విధంగా ముందుకు వెళ్తుంది. ప్రకాశం జిల్లా నుంచి పెద్ద పెద్ద నాయకులు అధికార పార్టీలో ఉన్నా సొంత జిల్లాలో సౌకర్యాల గురించి పట్టించుకోరు. వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి 20 ఏళ్లు పూర్తవుతోంది. దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో శ్రీ వైవీ సుబ్బారెడ్డి చెప్పగలరా? కోస్తా మొత్తం తిరుగుతారు.. సొంత జిల్లాలో రైతులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి పట్టించుకోరు.
• రైతుల కోసం నిలిచిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్
వర్తమాన రాజకీయాల్లో రైతులకి అండగా నిలబడిన ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 73 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించారు. అలాంటి నాయకుడి మీద విమర్శలు చేయడం, టీవీ డిబేట్లలో మాట్లాడడం మినహా మంత్రులు ఏం చేస్తున్నారు. చిత్తశుద్ధి నిజాయతీ ఎవరికి ఉన్నాయో ప్రజలు అర్ధం చేసుకోవాలి. ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి విమర్శిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి రైతుల్ని ఆదుకునేందుకు తన జేబు నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు చేశారా?
• మీ ప్రభుత్వ వైఫల్యాలపై పాదయాత్ర చేయగలరా?
ఎన్నికల ముందు ప్రాజెక్టులు పూర్తి చేయాలని పాదయాత్రలు చేసిన శ్రీ వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు తమ ప్రభుత్వ వైఫల్యాలపైనా పాదయాత్ర చేయాలి. వెలిగొండ ఎందుకు నిర్మించలేకపోయారు. గుంటూరు ఛానల్ గురించి ఎన్ని సార్లు మెమోరాండం ఇచ్చారో గుర్తులేదా? డీఎస్పీల బదిలీలు.. ఫ్లెక్సీల గురించి ఆలోచన చేయడమే వైసీపీ పరిపాలన. ప్రకాశం జిల్లా నుంచి యువత ఎందుకు వలసలు పోతున్నారు. మైనింగ్ పరిశ్రమ రెండేళ్లపాటు ఎందుకు మూతపడింది. ఇప్పుడు వారితో వాటాల ఒప్పందాలు చేసుకుని తిరిగి కొనసాగిస్తున్నారు. కక్షపూరిత చర్యలతో ఈ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది. సంక్షేమ పథకాల అమలులో లబ్దిదారుల్ని సమానంగా చూసే పరిస్థితులు లేవు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సాయంతో కొంత మందికే పరిమితం అవుతున్నారు. ఆరోగ్యశ్రీలో ఆసుపత్రులకు వెయ్యి కోట్ల బకాయి పడ్డారు. మొన్న రూ. 100 కోట్లు ఇచ్చారు.
• రాష్ట్ర హితం కోసం పొత్తులు
జనసేన పార్టీ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజా సమస్యలపై బలంగా వాణి వినిపించే విధంగా ముందుకు వెళ్తుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాం. ఒక మంచి ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ కి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా కృషి చేస్తాం. ఇప్పటం సభలోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అనే గొప్ప నిర్ణయం ప్రకటించారు. ఈ ప్రభుత్వ అవినీతి, దుర్మార్గాలు, దాష్టికాలను దృష్టిలో పెట్టుకుని అంతా కలసి ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్ర హితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తాం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పారదర్శకంగా, ప్రజల ముందు చర్చించి రాష్ట్రానికి మేలు జరిగే విధంగా పొత్తులు ఉంటాయి. ఇప్పటికే శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అగ్రనాయకత్వంతోపాటు, శ్రీ చంద్రబాబు నాయుడు గారితో చర్చించారు. సీట్లు ఓట్ల గురించి కాకుండా కేవలం రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఆ చర్చలు సాగాయి. పొత్తుల విషయంలో అంతా పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్తామ”న్నారు.
• క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు
ప్రకాశం జిల్లా, కొండెపి నియోజకవర్గం, మూలగుంటపాడుకు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ ఆవుల వెంకట ప్రసాద్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీ వెంకట ప్రసాద్ మృతికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున రూ. 5 లక్షల 

బీమా చెక్కును అతని భార్య శ్రీమతి ఆవుల మాధవికి అందచేశారు. పార్టీ తరఫున భవిష్యత్తులోనూ అన్ని విధాలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పిల్లల చదువుల బాధ్యతలు జనసేన పార్టీ తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్, అధికార ప్రతినిధులు డా. పాకనాటి గౌతమ్, శ్రీమతి రాయపాటి అరుణ, కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ నేతలు ఈదర హరిబాబు, మలగా రమేష్, శ్రీఇమ్మడి కాశీనాథ్, బెల్లంకొండ సాయిబాబు, పులి మల్లికార్జున్, శ్రీమతి బొందెల శ్రీదేవి, శ్రీ కందుకూరి బాబు, చిట్టెం ప్రసాద్, లీగల్ సెల్ నాయకులు సుంకర సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.