చినుకు రాలితే.. చిత్తడే

  • ఆటో నగర్ లో ఎక్కడ చూసినా బురదమయం
  • జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 29వ డివిజన్ లో ఉన్న సుభాష్ చంద్రబోస్ నగర్, ఆటో నగర్ ప్రాంతాల్లో చినుకు రాలితే చిత్తడిగా మారిపోతుందని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆరోపించారు. గురువారం 29వ డివిజన్ లోని పలు ప్రాంతాలను ఆయన జనసైనికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ఇప్పటివరకు తుఫాన్లు, వరదలు రాలేదని రెండు మూడు రోజుల నుంచి కేవలం చిన్నపాటి వాన చినుకులు మాత్రమే పడుతున్నాయని అన్నారు. ఈ చినుకులకే మొత్తం జలమయమై పోతున్నాయన్నారు. జిల్లా, నగరంలో వాహనాల మరమ్మతుల కోసం అనేకమంది ప్రజలు ఆటోనగర్ కు వస్తుంటారని, ఇక్కడ వేల మంది ఉపాధి నిమిత్తం వస్తుంటారని, కనీస సౌకర్యాలు అయిన రోడ్లు ఏర్పాటు చేయలేక పోవడం సిగ్గు చేటు అన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడ కాలు పెట్టినా జారి పడిపోయే ప్రమాదం ఉందన్నారు. నుడా నిధులతో ఈ వైసీపీ పాలకులు ఏదో అరకొర రోడ్లు వేసి.. అన్ని రోడ్లు వేశామని గొప్పలు చెప్పుకోవడం దారుణమన్నారు. ఈ ప్రాంతంలో కొంత భాగం ఏపీ ఐఐసీ పరిధిలోకి వస్తుందని, మరి కొంత భాగం కార్పొరేషన్ పరిధిలోకి వస్తుందన్నారు. ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారే తప్ప సమస్యను పరిష్కరించ లేదని ఆరోపించారు. రెండు మూడు రోజుల్లో స్థానికులతో కలిసి జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్ ను కలిసి వినతిపత్రం అందిస్తామని తెలిపారు. వెంటనే ఈ ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించాలని, లేనియెడల మరో మూడు నాలుగు నెలల్లో జనసేన, టీడీపీ ప్రభుత్వం రాగానే మొట్టమొదట నెల్లూరు రూరల్ లోని ఈ ప్రాంతం నుంచే అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందరరామిరెడ్డి, రూరల్ మండల అధ్యక్షులు జగదీష్ రెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి కరీం, నగర డివిజన్ ఇంచార్జిలు భీమయ్య, ఉదయ్, అదిశేషయ్య, రామాంజనేయులు, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.