శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే స్వర్ణయుగం వస్తుంది

* రానున్నది ఖచ్చితంగా జనసేన ప్రభుత్వమే
* యలమంచిలి జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ సభలో శ్రీ నాగబాబు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణయుగం వస్తుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు వెల్లడించారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో యలమంచిలి జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో శ్రీ నాగబాబు గారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న కాలంలో ఖచ్చితంగా జనసేన ప్రభుత్వమే ఏర్పడుతుందని స్పష్టం చేశారు. జనసేన ప్రభుత్వంలో రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు ప్రతీ ఒక్కరికీ ప్రయోజనకరమైన పాలన ఉంటుందని చెప్పారు. అవినీతి నాయకులు దోచుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు ప్రజా ప్రయోజన పాలన కోసం ఎందుకు రావు అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని దాదాపుగా దోచుకున్నారని, మరొక్కసారి వైసీపీని నమ్మితే మనకు భవిష్యత్తు లేకుండా చేస్తారని అన్నారు. ఎత్తులు, పొత్తుల గురించి మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వదిలేసి జనసేన పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే ప్రతీ వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత జన సైనికులు, వీర మహిళలపై ఉన్నదని అన్నారు. యువతను గంజాయి మత్తుకు, రవాణాకు అలవాటు చేసి వేలాది మంది యువకులను జైళ్లలో మగ్గేలా చేసిన ఘనత వైసీపీకి దక్కుతుందని అన్నారు. గంజాయికి కేరాఫ్ ఆంధ్ర ప్రదేశ్ అని చెప్పుకునే పరిస్థితికి తెచ్చారని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన ఆస్తులు దాదాపుగా దోచుకున్నారని, ఆలయానికి వచ్చే ఆదాయం ఎటు పోతోందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నదని అన్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని బాధ్యతతో స్వీకరించానని, జనసేన అభ్యర్థులను గెలిపించటమే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం నుంచి యలమంచిలి వరకూ జరిగిన ర్యాలీలో వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు రోడ్లపై నిలబడి నాగబాబు గారికి ఘన స్వాగతం పలికారు.