చైతన్య స్ఫూర్తి ఆగిపోదు.. విప్లవ జ్యోతి ఆరిపోదు

వీరులకు పుట్టుకేగాని గిట్టుక ఉండదు. వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుంది. వారు రగిల్చిన విప్లవాగ్ని సర్వదా జ్వలిస్తూనే ఉంటుంది. అటువంటి ధీరుడే మన మన్నెం వీరుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు. ఆ మహా యోధుడు వీర మరణం పొంది నేటికి వందేళ్లు. ఈ పుణ్య తిధినాడు ఆ విప్లవ జ్యోతికి భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కారణజన్ములు తాము చేయవలసిన కార్యాన్ని పూర్తి చేసి అదృశ్యమై పోతారు. దాస్యశృంఖలాలతో అణగారిపోతున్న ప్రజలలో చైతన్యం రగల్చడానికి వచ్చిన శ్రీ సీతారామరాజు, ఆ కార్యం నెరవేర్చి, నవ యువకుడిగానే మహాభినిష్క్రమణం గావించారు. శ్రీ సీతారామరాజు మన్యం ప్రజలలో రగిల్చిన విప్లవాగ్ని గురించి తెలుగు నేల నలు చెరగులకూ విదితమే.
* భారతరత్న ప్రకటించాలి
నేటి తరం దేశవాసులందరికీ శ్రీ అల్లూరి సీతారామరాజు సంకల్పం.. పోరాట పటిమ.. ధీరత్వం.. మృత్యువుకు వెరవని ధైర్యం.. జ్ఞాన-ఆధ్యాత్మిక సంపదల గురించి తెలియాలి. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. భారతరత్న ప్రకటించి ఆ పురస్కారానికి మరింత వన్నె అద్దాలి. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించాలి. ఆయన స్ఫూర్తిని దేశమంతటికీ చాటాలి. జనసేన అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను మేమే స్వీకరిస్తామని.. ఆ చైతన్యమూర్తి వర్ధంతి సందర్భంగా వినమ్రంగా ప్రకటిస్తూ ఆ తేజోమూర్తికి నా పక్షాన, జనసేన పక్షాన అంజలి ఘటిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.