రైతు నష్టపోతే పాలకుల్లో కదలిక లేదు…యంత్రాంగంలో స్పందన లేదు

• ముఖ్యమంత్రి గాఢ నిద్ర వీడాలి
• రైతుల పక్షాన జనసేన పోరాడుతుంది
• కొల్లిపర మండలంలో రైతుల్ని పరామర్శించిన నాదెండ్ల మనోహర్

అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోతే పాలకుల్లో కదలిక లేదు.. ప్రభుత్వ యంత్రాంగంలో స్పందన లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గాఢ నిద్ర నుంచి మేల్కొని స్వయంగా పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి రైతాంగానికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు విత్తు నుంచి కొనుగోలు వరకు పెద్దన్నలా అండగా ఉంటానని చెప్పిన శ్రీ జగన్ రెడ్డి రైతుని నమ్మించి మోసం చేశారని తెలిపారు. ప్రతి గింజా కొనుగోలు చేసే వరకు జనసేన పార్టీ తరఫున రైతుకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతుల్లో భరోసా.. అధికారుల్లో కదలిక.. రైతు భరోసా కేంద్రాల్లో మార్పు వచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. సోమవారం కొల్లిపర మండల పరిధిలోని నందివెలుగు, చివులూరు, తుములూరు గ్రామాల్లో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను కలిశారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “అకాల వర్షాలకు పంటలు పోయి రైతులు కష్టాలు పడుతుంటే ఈ ప్రభుత్వం స్పందించలేని పరిస్థితుల్లో ఉంది. క్షేత్ర స్థాయిలో వివరాలు తెలుసుకుంటే బాధ కలుగుతోంది. రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా ఇదే సమస్య. వ్యవస్థ మారితే మెరుగైన సేవలు అందుతాయని భావించిన రైతులకు ఈ ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. రూ. 6 వేల కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఏమయ్యాయో తెలియదు. ప్రతి గింజా కొంటామన్న ముఖ్యమంత్రి ప్రకటన పత్రికలకే పరిమితం అయ్యింది. కొల్లిపర మండలంలో విద్యుత్ ఘాతంతో ఏడు ఎకరాల్లో పంట, కుప్పలు కాలిపోతే ఇప్పటి వరకు అధికారులు తొంగి చూసిన దాఖలాలు లేవు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి రైతులకు అండగా నిలబడాలి. వారి నుంచి కనీస స్పందన లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
* మద్దతు ధర దక్కితే చాలు అనుకొంటున్నారు
కొల్లిపర మండలంలో 6 వేల ఎకరాల్లో మొక్కజొన్న, వెయ్యి ఎకరాల్లో జొన్న పంటకు నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు పంట కొంటామని రైతు భరోసా కేంద్రాల నుంచి సమాచారం కూడా రాలేదు. గతంలో మార్కెటింగ్ యార్డుల ద్వారా పట్టాలు, వ్యవసాయ యంత్ర పరికరాలకు చేయూత అందించే వాళ్లం. ఇప్పుడు రైతుల్ని కనీస మద్దతు ధర దక్కితే చాలు మా బాధలు మేము పడతామనే స్థితికి తీసుకువచ్చారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టంతో కౌలు రైతు పూర్తిగా చితికిపోయాడు. ఈ ప్రభుత్వం వచ్చాక వేలాది మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ.5 కోట్ల విరాళం ఇచ్చి వారి కుటుంబాలకు లక్ష చొప్పున భరోసాగా ఇస్తూ ఆదుకుంటున్నారని అన్నారు.
• డెల్టా రైతులు చేసిన పాపం ఏంటో తెలియదు: రైతుల ఆవేదన
ఈ పర్యటనలో రైతాంగం తమ ఆవేదనను శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి తెలియచేశారు. రైతులు మాట్లాడుతూ “ప్రభుత్వం ఏవో పథకాల పేర్లు చెబుతుందిగానీ ఇలాంటి పరిస్థితుల్లో కనీస మద్దతు ధర అయినా చెల్లిస్తే రైతు బయటపడతాడు. యూరియా నుంచి అన్ని ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. జొన్న పంటకు రాయలసీమలో ఒక ధర.. డెల్టా ప్రాంతంలో ఒక ధర చెల్లిస్తున్నారు. డెల్టా రైతులు ఏం పాపం చేశారో తెలియడం లేదు. పట్టాలు ఇవ్వడం లేదు. ధర లేదు కదా అని మార్కెట్ యార్డుల్లో పెట్టుకుందామంటే ఆ పరిస్థితి లేదు. విద్యుత్ ఘాతంగా పంట కాలిపోతే ఇప్పటి వరకు అధికారులు తొంగి చూడలేదు” అన్నారు. ప్రభుత్వంలో కదలిక వచ్చే విధంగా పోరాటం చేస్తామని మనోహర్ గారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, పార్టీ నాయకులు ఇస్మాయిల్ బేగ్, తోటకూర వెంకట రమణరావు, జాకిర్ హుస్సేన్, పసుపులేటి మురళీకృష్ణ, దివ్వెల మధుబాబు, యర్రు వెంగయ్యనాయుడు, చదలవాడ వేణుమాధవ్, కిషోర్ రెడ్డి, గురవారెడ్డి, శ్రీహరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.