జగన్ కు ఉత్తరాంధ్ర అంటే ప్రేమా లేదు.. దోమా లేదు

* విలువైన ప్రకృతి సంపద మీదే అతని కన్ను
* దాన్ని అడ్డగోలుగా వైసీపీ నాయకుడు దోచేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు
* ప్రకృతి వనరుల దోపిడీని జనసేన అడ్డుకుంటుంది
* గ్రీన్ ట్రైబ్యునల్ కు ప్రకృతి వనరుల విధ్వంసంపై ఫిర్యాదు చేస్తాం
* అనకాపల్లి నియోజకవర్గం విస్సన్నపేట ఆక్రమణ భూములను పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్

‘జగన్ కు ఉత్తరాంధ్ర అంటే ప్రేమ, దోమ ఏమీ లేదు. ఉత్తరాంధ్రలో ఉన్న విలువైన సహజ వనరులను దోచుకోవడం, ప్రకృతి వనరులను కబ్జా చేయడం మాత్రమే జగన్ లక్ష్యం. దాని కోసమే జగన్, అతని మంత్రులు ఉవ్విళ్లూరుతున్నారు. ఎక్కడ కొండ కనిపించినా, ప్రభుత్వ భూమి కనిపించినా దాన్ని ఆక్రమించి దోచుకోవడానికి వైసీపీ నాయకుడు సిద్ధంగా ఉంటాడు’ అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అనకాపల్లి నియోజకవర్గం విస్సన్నపేటలో కొండల మధ్య కబ్జా చేసి, రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన 660 ఎకరాల భూములను సోమవారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. కొండపై నిర్మించిన సైట్ ఆఫీస్, అక్కడే నిర్మించిన హెలిపాడ్ గురించి నాయకులు పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడే మీడియాతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “సహజ సిద్ధంగా ఏర్పడిన కొండల స్వరూపాన్ని వైసీపీ నాయకులు పూర్తిగా మార్చేస్తున్నారు. బయ్యారం రెవిన్యూ గ్రామంలో సర్వే నంబర్ 195/2 లో ఉన్న కీలకమైన పోరంబోకు, దళితుల భూములు, కొండ భూములను అన్యాయంగా ఆక్రమించారు. కొండల నుంచి జాలువారే వర్షపు నీరు క్యాచ్మెంట్ ఏరియాను మొత్తం మూసి వేశారు. సమీపంలోని రంగబోలు రిజర్వాయర్లోకి వెళ్లే గెడ్డలు, కాలువలు, వాగులు అన్నీ మూసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ చేపట్టబోయే అతి పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ విలువ రూ.13 వేల కోట్ల రూపాయలు. ఇంత పెద్ద దోపిడీ కోసం ప్రకృతి వనరులను వైసీపీ నాయకులు అడ్డగోలుగా దోచేస్తున్నారు.
* వాల్టా చట్టానికి తూట్లు
అడ్డగోలుగా కొండలను పిండి చేసి, ఆ స్థలాలను కాజేస్తున్న వైసీపీ నాయకులు వాల్టా చట్టానికి పూర్తిగా తూట్లు పొడుస్తున్నారు. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం. వైసీపీ నాయకులు రాష్ట్రంలో చేస్తున్న అడ్డగోలు దోపిడీ మీద కేంద్రం వద్ద నివేదిక ఉంది. రాష్ట్రంలో యువతకు ఉపాధి లేదు.. ఉద్యోగాలు లేవు. ఇంకోపక్క రాష్ట్రం రోజు రోజుకి అప్పుల్లో కూరుకు పోతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు వైసీపీ నెరవేర్చింది లేదు. ఇన్ని సమస్యలు వదిలేసి వైసీపీ మంత్రులు, నాయకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించాలనే దానిపై దృష్టిపెట్టారు. ముఖ్యంగా ప్రకృతి వనరులను వైసీపీ నాయకులు దోచుకుంటున్న తీరు, చట్టాలను పట్టించుకోని వారి అధికార దుర్నీతిని జనసేన పార్టీ ప్రశ్నిస్తుంది. ప్రజలకు సంబంధించిన విలువైన ఆస్తులను కాజేస్తున్న వైసీపీ నాయకుల దోపిడీని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పిఏసీ సభ్యుడు కోన తాతారావు, ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, రాష్ట్ర అధికార ప్రతినిధులు పరుచూరి భాస్కర రావు, సుందరపు విజయ్ కుమార్, పార్టీ నేతలు గడసాల అప్పారావు, శ్రీమతి అంగా ప్రశాంతి, పంచకర్ల రమేష్, పి.వి.ఎస్.ఎన్.రాజు, వి.గంగులయ్య, బి.శివదత్, డా.రఘు, మూర్తి యాదవ్, దల్లి గోవిందరెడ్డి, దూలం గోపీ తదితరులు పాల్గొన్నారు.