అనకాపల్లిలో జనసేనానికి ఘనస్వాగతం

• అగనంపూడి నుంచి అనకాపల్లి వరకూ భారీ ర్యాలీ
• జనంతో కిక్కిరిసిన జాతీయ రహదారి
• హారతులతో స్వాగతించిన బయ్యారం, విస్సన్నపేట గ్రామస్తులు
• విస్సన్నపేటలో వైసీపీ భూ ఆక్రమణల ప్రాంతాన్ని సందర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్
• ఉమ్మడి విశాఖ జిల్లాలో వారాహి విజయ యాత్ర

వారాహి విజయయాత్రలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గం పరిధిలోని విస్సన్నపేటలో వైసీపీ నేతలచే ఆక్రమణలకు గురైన భూములను పరిశీలించేందుకు వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అగనంపూడి టోల్ గేట్ నుంచి జన సైనికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అగనంపూడి, మారేడుపూడి, గొల్లవానిపాలెం, అనకాపల్లి బైపాస్, కొత్తూరు, కశింకోట తదితర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున జాతీయ రహదారి పైకి వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హారతులు పట్టారు. ప్రతి గ్రామం నుంచి జనసైనికులు, ప్రజలు ద్విచక్ర వాహనాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అనుసరించారు. వాహన శ్రేణి వెనుక సుమారు మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది. జనసేన ర్యాలీతో 5వ నంబర్ జాతీయ రహదారి మొత్తం జనంతో కిక్కిరిసింది. అగనంపూడి నుంచి బయ్యారం వరకు హైవే మొత్తం జనసేన జెండాలు, బ్యానర్లతో నిండిపోయింది. ఆడపడుచులు హారతులు పట్టి దిష్టితీయగా, పూల వర్షంతో ముంచెత్తారు. తనకోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగారు. బయ్యారం, విస్సన్నపేట గ్రామాల ప్రజలు ప్రతి ఇంటి ముందు హారతులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని స్వాగతించారు. అక్కడి నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలతో కలసి భూ ఆక్రమణలు జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. సగం కొండను తవ్వేసి వేసిన రోడ్డుని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ కొండపైన నిర్మించుకున్న గెస్ట్ హౌస్ ని మీడియా వాహనంపై నుంచి రాష్ట్ర ప్రజలకు చూపించారు.
• అక్రమ భూ ఆక్రమణ ప్రాంతాన్ని పరిశీలించిన శ్రీ మనోహర్
శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు విస్సన్నపేట భూ ఆక్రమణ ప్రాంతం మొత్తాన్ని పరిశీలించారు. అక్రమ తవ్వకాలు, కొండ మీద నిర్మించిన గెస్ట్ హౌస్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. వందల ఎకరాలు దురాక్రమణకు గురైన వైనాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 45 ఎకరాల చెరువుని పూడ్చారని స్ధానిక యువత ఆవేదన వ్యక్తం చేసింది.
• స్వచ్ఛమైన గాలి పీల్చే హక్కు కల్పించండి: అగనంపూడి గ్రామస్తులు
శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లి వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు దారి పొడవునా సమస్యలు ఆయన దృష్టికి తీసుకు వెళ్లేందుకు ముందుకు వచ్చారు. ఫార్మా కాలుష్యం వల్ల స్వచ్ఛమైన గాలి పీల్చుకునే హక్కు కోల్పోయామంటూ ప్లకార్డుల రూపంలో తమ సమస్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. రాత్రిళ్లు 10 తర్వాత ఊపిరి సలపనంతగా కంపెనీలు దుర్వాసన వెదజల్లుతున్నాయని, ఫార్మా వ్యర్ధాలతో భూగర్భ జలాలు పూర్తిగా కాలుష్యం బారినపడ్డాయని ఆ గ్రామ ప్రజలు వాపోయారు. మా గ్రామాల్లో క్యాన్సర్ రోగులు పెరిగారు. మీరే కాపాడాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.mతాడి గ్రామం తరలింపు శ్రీ పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం అంటూ ఫార్మా వ్యర్ధాల బాధితులు తమ సమస్యను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. అనకాపల్లిలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించడం ద్వారా వేలాది మంది ప్రజలకు న్యాయం చేయగల నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారేనంటూ ఆ సమస్యను జనసేన అధినేత దృష్టికి తీసుకువస్తూ ప్ల కార్డులు ప్రదర్శించారు.