సమస్యలపై జనసేన సమరభేరి

•జనవాణి అర్జీల పరిష్కారం దిశగా అడుగులు
•కార్యాచరణను సమీక్షించిన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత రెండు విడతల్లో స్వీకరించిన అర్జీల పరిశీలన చేసి, వాటిపై లేఖలు రాసే ప్రక్రియ ప్రారంభమయ్యింది. సోమవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, వాటి పరిష్కారాలు సంబంధిత కార్యాచరణపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి, పార్టీ నాయకుడు డి.వరప్రసాద్ నేతృత్వంలో వచ్చిన అర్జీలను శాఖల వారీగా విభజించి, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులకు అర్జీదారుల సమస్యలను తెలియజేస్తారు. ఇందుకోసం ప్రత్యేక బృందం పని చేస్తుంది. ప్రతి అర్జీని ఎప్పటికప్పుడు అనుశీలన చేసి, సమస్యను పరిష్కారం దిశగా తీసుకువెళ్లేందుకు ఈ బృందం కృషి చేస్తుంది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రతి సమస్యను సమీక్షించి, స్వయంగా సంబంధిత శాఖలకు లేఖలు రాస్తారు.