ప్రతి పల్లెలో జనసేన బలంగా విస్తరిస్తోంది

* సత్తుపల్లిలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రతీ పల్లెలో జనసేన పార్టీ బలంగా విస్తరిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం సీతారామపురంలో జెండా దిమ్మెను ఆవిష్కరించిన అనంతరం నాగబాబు మాట్లాడారు. పార్టీ శ్రేణులు రాజ్యాధికారం లక్ష్యంగా పని చెయ్యాలని సూచించారు. జన సైనికుల ఉత్సాహం ఎన్నికల సమయంలో జనసేనకు ఓట్లు వేయించే స్థాయిలో ఉపయోగ పడాలని అన్నారు. గ్రామాల్లో జనసేన విస్తరిస్తోన్న తీరు చూస్తుంటే జనసేన కోసం పని చేయాలనే ఆకాంక్ష అందరిలో పెరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంఛార్జి రామ్ తాళ్లూరి పాల్గొన్నారు.
* క్రియాశీలక కార్యకర్తకు ప్రమాద బీమా చెక్
ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదానికి గురైన జనసేన క్రియాశీలక కార్యకర్త ఆళ్ళ నవీన్ కి నాగబాబు చేతుల మీదుగా నలభై వేల రూపాయల ప్రమాద బీమా చెక్, తాళ్లూరి రామ్ తరఫున రూ.60 వేల చెక్ అందజేశారు. జనసేన తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి మిరియాల రామకృష్ణ అధ్యక్షతన సత్తుపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పొలిట్ బ్యూరో సభ్యులు అర్హమ్ ఖాన్, తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోకుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.