భవిష్యత్తు తరాలను కాపాడుకోవటానికి జనసేనను గెలిపించుకోవాలి

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతిపరులు, దోపిడీదారుల నుంచి విముక్తి చేయాలి
*శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు నేనూ ఒక కార్యకర్తనై పనిచేస్తా
* జనసేన పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు

అవినీతిపరులు, దోపిడీదారుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి, భవిష్యత్తు తరాలను కాపాడుకోవటానికి జనసేనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు స్పష్టం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో బలంగా ప్రచారం చేస్తూ, జనసేన గెలుపే లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్య కార్యకర్తలతో శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో శ్రీ నాగబాబు గారు సమావేశమై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమూల్యమైన వనరులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో, ప్రజా ఆమోద పరిపాలన అందించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దోపిడీకి గురవుతున్న రాష్ట్ర ఆర్థిక వనరులు, ప్రకృతి సంపదను కాపాడే సమర్థత జనసేనకు మాత్రమే ఉన్నదని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి జనసేన దగ్గర వినూత్నమైన ప్రణాళికలు ఉన్నాయని, పవన్ కల్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే అవినీతి అనే పదమే వినపడకుండా ప్రజా ప్రయోజన పరిపాలన అందిస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకూ నేనూ ఒక కార్యకర్తగా పని చేస్తానని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా గ్రామీణ స్థాయిలో విస్తరించి పని చెయ్యాల్సిన ఆవశ్యకతను వివరించారు. కార్యకర్తలు అంతా సమష్టిగా పని చేయాలని సూచించారు.