కొణిజేటి రోశయ్య రాజకీయ, పాలన అనుభవాలు ప్రత్యేకమైనవి

* రోశయ్య రెండో వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్ర పాలనలో చెరిగిపోలేని ముద్ర వేసిన నిబద్ధతగల నాయకుడు కొణిజేటి రోశయ్య గారు.. హుందాతనం నిండిన రాజకీయాలు సాగించారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య రెండో వర్ధంతి సందర్భంగా సోమవారం తెనాలిలో ఆయన విగ్రహానికి మనోహర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “కీలకమైన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ రోశయ్య గారు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో తన వంతు కృషి చేశారు. శాసనసభలో ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ అందరికీ సమాన గౌరవం ఇచ్చే రోశయ్య గారు శాసనసభకే హుందాతనం తీసుకొచ్చారు. నిండుగా ఎప్పుడూ నవ్వుతూ, కొత్తవారిని ప్రోత్సహిస్తూ రాజకీయాలు చేశారు. శాసనసభలో శ్రీ రోశయ్య గారు ఉన్నపుడు నేను శాసన సభాపతిగా వ్యవహరించడం మరచిపోలేని అనుభవం. రాజకీయాలతో సంబంధం లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం నిత్యం ఆలోచించే ఆయన వ్యక్తిత్వం నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం. పదవులు ఉన్నా, లేకున్నా ఆయన వ్యవహార శైలి ఎప్పుడు ఒకేలా ఉండేది. ప్రజలతో మమేకం కావడానికి, వారికి ఏది అవసరమో అది నెరవేర్చడానికి శ్రీ రోశయ్య గారు నిరంతరం తపించేవారు. తెనాలి పట్టణానికి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు” అన్నారు. శ్రీ రోశయ్య గారి విగ్రహానికి ఆయన కుమారుడు శ్రీ కొణిజేటి శివ పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం పెద్దలు, తెనాలి ప్రముఖులు నూకల వేణు, పొన్నూరు శశి, ఉప్పల వరదరాజులు, మాలేపాటి హరి, కొణిజేటి గోపి, బూరెల నరసింహారావు, రావూరి సుబ్బారావు, రజనీకుమార్, చుండూరు సాయి, పెనుగొండ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.