ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా పనిచేద్దాం

* అజయ్ అందరికీ అందుబాటులో ఉంటారు
* “వర్చువల్” సమావేశంలో జనసేన కార్యవర్గంతో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు

ప్రజా సమస్యలపై పోరాటం, ప్రజా సమస్యల పరిష్కారం ప్రధాన అజెండాగా జనసేన పార్టీ కార్యవర్గం పని చేయాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు వెల్లడించారు. జనసేన పార్టీ కార్యవర్గంతో బుధవారం నాగబాబు “వర్చువల్” సమావేశం ద్వారా మాట్లాడారు. జనసేన పార్టీ జాతీయ మీడియా అధికారిక ప్రతినిధి, పార్టీ అంతర్గత క్రమశిక్షణ, నిర్వహణ బాధ్యులు వేములపాటి అజయ్ కుమార్ ని పార్టీ కార్యవర్గం సభ్యులకు నాగబాబు ప్రత్యేకంగా పరిచయం చేశారు. అజయ్ గారు పార్టీ కార్యవర్గ సభ్యులకు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం బాధ్యులు అందరికీ అందుబాటులో ఉంటారని, పార్టీకి సంభందించిన అంశాలు ఏవైనా అజయ్ గారితో సంప్రదించవచ్చని సూచించారు. క్షేత్రస్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి నాయకుల వరకూ అందరూ సమన్వయంతో పార్టీ పటిష్టత కోసం పని చేయాలని స్పష్టం చేశారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ బాధ్యులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులు, జనసేన మీడియా విభాగం ప్రతినిధులు ఈ “వర్చువల్” సమావేశంలో పాల్గొన్నారు.
రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయగలిగేది శ్రీ పవన్ కళ్యాణ్ మాత్రమే: శ్రీ వేములపాటి అజయ్ కుమార్
భ్రష్టు పట్టి పోతున్న రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయగలిగే సత్తా, సామర్థ్యం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉన్నదని జనసేన పార్టీ జాతీయ మీడియా అధికారిక ప్రతినిధి, పార్టీ అంతర్గత క్రమశిక్షణ, నిర్వహణ బాధ్యులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు స్పష్టం చేశారు. జనసేన ఆవిర్భావం నుంచే పరోక్షంగా పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్నట్టు చెప్పారు. ఉన్నతమైన బాధ్యతను అప్పజెప్పిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలంకు, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా జనసేన పటిష్టత కోసం పని చేస్తానని అన్నారు. జనసేన కార్యవర్గం సూచనలు, సలహాలతో సమిష్టి కార్యాచరణ, ప్రణాళికలు చేపడతామని పేర్కొన్నారు. ఆంధ్రా గాంధీగా పేరొందిన శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, బెజవాడ గోపాలరెడ్డి గారు లాంటి మహామహులతో తమ కుటుంబానికి సాన్నిహిత్యం ఉండడంతో రాజకీయాల పట్ల చైతన్యం, పరిజ్ఞానం పెంపొందించుకున్నప్పటికీ, కుళ్ళుపట్టిన రాజకీయ వ్యవస్థకు ఇంతకాలం దూరంగా ఉన్నామని అన్నారు. ప్రపంచస్థాయిలో ప్రాచుర్యం, లెక్క లేనంత డబ్బు సంపాదించగలిగే అవకాశం ఉన్నా కేవలం ప్రజల కోసం తన విలువైన జీవితాన్ని త్యాగం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూసి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఆశయంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేష్టలకు ప్రజలు అల్లాడి పోతున్నారని, కేవలం జనసేనతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుందనే భావనలో ప్రజలు ఉన్నారని, ప్రజా అభిప్రాయంకు అనుకూలంగా జనసేన ప్రభుత్వం సాధించే దిశగా అందరం కలిసికట్టుగా పని చేద్దామని వెల్లడించారు.