ఏపీలో ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్

ఏపీలో గతంలో వివిధ కారణాలతో పలు స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నేడు నెల్లూరు నగరపాలక సంస్థకు, 12 మున్సిపాలిటీలకు, పలు నగర పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనిది కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాగా, అనంతపురం జిల్లా పెనుకొండ, గుంటూరు జిల్లాలో గురజాల, దాచేపల్లి, కడప జిల్లాలో కమలాపురం, రాజంపేట, నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం, కర్నూలు జిల్లాలో బేతంచర్ల, కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట, కొండపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు, ప్రకాశం జిల్లాలో దర్శి మున్సిపాలిటీలకు కూడా నేడు ఎన్నికలు జరిగాయి. కాగా, ఈ నెల 17న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.