‘మాట’కు అందని అభిమానం!

జనసేన కౌలు రైతు భరోసా యాత్రకు బధిర యువకుడు ఫణీంద్ర రూ. లక్ష విరాళం

విజయవాడ: స్పందించే మనసుకు మాట అవసరం లేదు.. అర్థం చేసుకునే హృదయానికి వినికిడి అవసరం లేదు. జనసేన పార్టీ ప్రయాణం ఆ మనసుకు అర్థమైంది… జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు చేస్తున్న సహాయం ఆ మనసును తట్టి లేపింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం సంపర గ్రామానికి చెందిన తిబిరిశెట్టి వీర ఫణింద్ర బధిరుడు. పుట్టిన దగ్గర నుంచి ఎలాంటి ధ్వని వినిపించదు, మాట్లాడలేడు. వారిది చాలా పేద కుటుంబం, ఇంట్లోని వారంతా కూలీ పనులు చేస్తున్నారు. అయినా ఫణీంద్ర సంకల్పం చేసుకుని మరీ ఉద్యోగం చేస్తూ.. వచ్చిన డబ్బును రూపాయి, రూపాయి పొదుపు చేసి దాచాడు. అతడి మనసుని తాకిన జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం ఏదైనా చేయాలని అనుకున్నాడు, పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు తన వంతు సహాయంగా దాచుకున్న సొమ్మును ఇవ్వాలని భావించాడు. జనసేన పార్టీ కోసం దాచిన రూ.లక్ష చెక్ ను ఆదివారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు మంగళగిరి పార్టీ కార్యాలయంలో అందించారు. ఫణింద్ర గొప్ప మనసు పవన్ కళ్యాణ్ ను కదిలించింది.