ఎస్.సి, ఎస్.టి శాశ్వత చట్టం ఏర్పాటు చేసి, సబ్ ప్లాన్ చట్టం కాలపరిమితి పెంచాలి: ఆదాడ మోహనరావు

విజయనగరం: ఎస్.సి, ఎస్.టి. శాశ్వత చట్టం ఏర్పాటు చేయాలని,ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాలపరిమితిని పెంచాలని, జనసేన పార్టీ నాయకులు, రాష్ట్ర దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు ఆదాడ మోహనరావు శుక్రవారం ఉదయం డి.అర్.ఓ. గణపతిరావు కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత, గిరిజనుల సమాగ్రాభివృద్దే లక్ష్యంగా 2012 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు రోజులపాటు ప్రత్యేకంగా చర్చించి ఏకగ్రీవంగా రూపొందించిన ఎస్సి, ఎస్టీ, సబ్ ప్లాన్ ప్రణాళిక కేటాయింపు మరియు ఆర్ధిక వనరుల వినియోగం చట్టం 2013 పేరున పది సంత్సరాలపాటు నాటి రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో రూపొందించారు. దళితులకు, గిరిజనులకు ప్రత్యేక స్మశాన వాటిక స్థలం కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ చట్టం కాలపరిమితి ఈ నెల 23వ తేదీన ముగియడంతో కాల పరిమితి పెంచాలని వినతి పత్రం అందజేశారు. సబ్ ప్లాన్ చట్టానికి బలపరచాల్సిన అంశాలను కూడా వినతిపత్రం జతచేసామని, దళితుల, గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ నాయకులు ఆర్. ఈశ్వరరావు, వై.భాస్కరరావు, కె.వరలక్ష్మి, టి. కళ, అర్.నాగమణి పాల్గొన్నారు.