లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

కరోనా లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే సిద్దిపేట కొవిడ్ దవాఖానకు రావాలి. ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు వైద్య బృందం, నర్సులు, స్టాఫ్‌ సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కొరోనా నుంచి కోలుకుంటున్న సక్సెస్‌ రేట్‌ 99.4 శాతం చాలా ఎక్కువగా ఉన్నదని, 0.6 శాతం మాత్రమే మృత్యువాత పడుతున్నారని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును సోమవారం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళ్ అరసుతో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొరోనా నేపథ్యంలో ఆక్సిజన్‌ అవసరాలు పెరిగాయని, హైదరాబాదు నుంచి సిద్ధిపేటకు రావాలంటే.. వైద్య సిబ్బంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గమనించి., గతంలో ఆక్సిజన్‌ సిలిండర్లతో యాక్సిడెంట్‌-ప్రమాదాలు జరిగిన సందర్భాలు దృష్టిలో పెట్టుకుని శాశ్వత ప్రాతిపదికన సిద్ధిపేట మెడికల్‌ కళాశాలకు లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకును తెప్పించినట్లు పేర్కొన్నారు. 24/7 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 405 బెడ్స్ కోసం పని చేసేలా రూ.61 లక్షల వ్యయంతో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకును తెప్పించినట్లు మంత్రి తెలిపారు. మెడికల్‌ కళాశాలలోని ఐసీయూలో 45 పడకలు, జనరల్‌ వార్డుల్లో 360 పడకలలో కొరోనా నేపథ్యంలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకు ద్వారా ఆక్సిజన్‌ సప్లయ్‌ చేయనున్నట్లు చెప్పారు.

ప్రజలు అనవసరంగా ప్రైవేటు హాస్పిటల్స్ కు పోయి తమ వేల, లక్షలాది రూపాయలు వృథా చేసుకోవద్దని మంత్రి కోరారు. సిద్ధిపేటలో వంద పడకల కోవిడ్‌ దవాఖానా ఉన్నదని మంచి డాక్టర్లు ఉన్నారని, అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని, ఆక్సిజన్‌ సప్లయ్‌ సమస్య ఇవాల్టితో శాశ్వతంగా పరిష్కారమైందని తెలిపారు.