పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి ఈటల..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది. వేడుక ఏదైనా గ్రీన్‌ చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనవాయితీగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి చోటామోటా లీడర్‌ వరకు తమ పుట్టిన రోజున మొక్కుల నాటుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు గ్రీన్‌ చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు.

తాజగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తన జన్మిదినం సందర్భంగా మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని ఎంపీ సంతోష్‌ కుమార్‌ కోరడంతో హుజురాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈటల రాజేందర్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ పుట్టిన రోజు నాడు హుజురాబాద్ నియోజకవర్గం లోని MLA క్యాంప్ కార్యాలయంలో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది అని మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. సంవత్సర కాలం నుండి కరోనా వైరస్ కారణంగా అందరం బాధపడుతున్నాము. దీనంతటికి కారణం వాతావరణం లో మార్పులు, పచ్చని వాతావరణంలో ప్రకృతి తో కలిసి జీవించిన వారికి కరోనా వ్యాధి దరిచేర లేదు కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి పిలుపునిచ్చారు.

అదేవిధంగా తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియజేయాలని మంత్రి ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. ఇతర ఖర్చతో కూడిన వేడుకలకు దూరంగా ఉండాలని కోరారు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని చెప్పిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.