తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక శ్రీ ఎన్.టి.ఆర్.

చరిత మరువని నటనా కౌశలం.. తెలుగు నుడికారంపై మమకారం.. పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికార కైవసం.. ఇలా మాట్లాడుకుంటే స్ఫురణకు వచ్చే ఒకే ఒక పేరు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన శత జయంతి సందర్భాన అంజలి ఘటిస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఎంతో మేలైనది.. ఎందరికో అనుసరణీయమైంది. ఢిల్లీ రాజకీయాలలో గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో తెలుగువారి ‘ఆత్మ గౌరవం’ అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచి అజేయమైన విజయం అందుకుని తెలుగువారి సత్తా ఢిల్లీ దాకా చాటారు. అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన శ్రీ ఎన్.టి.రామారావు గారు తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణం. ఈ పుణ్య దినాన ఆ మహనీయుడికి నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.