భరత మాతకు మరో మణి హారం నూతన పార్లమెంట్ భవనం

వీరుల త్యాగఫలంతో స్వతంత్రతను సాధించిన భారతావని సగర్వంగా వజ్రోత్సవాన్ని జరుపుకొంది. ఈ 75 వసంతాలలో ఎన్నో మార్పులు.. మరెన్నో చేర్పులు. పరాయి పాలకుల క్రీనీడలను పారదోలుతూ ఎన్నో కొంగ్రొత్త నిర్ణయాలు… విజయాలు. అగ్రగామి దేశంగా వెలుగొందడానికి అవిరళ కృషి చేస్తున్న సమయాన మన భరతమాత మెడలోని హారంలో మరో కొత్త సుమం చేరుతోంది.. అదే సెంట్రల్ విస్టా ఆవరణలో శోభాయమానంగా రూపుదిద్దుకున్న నూతన పార్లమెంటు భవనం అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో విశ్లేషించారు.  వివిధ రాష్ట్రాల కళల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ రాజ్యాంగ నిలయాన్ని గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన శుభ తరుణాన జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. త్రికోణాకారంలో రూపుదిద్దుకున్న ఈ మహాకృతి నిర్మాణానికి సంకల్పించిన శ్రీ నరేంద్ర మోడీ గారికి, బి.జె.పి. నాయకత్వానికి శుభాభినందనలు తెలుపుతున్నాను. భవన నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరూ చరితార్ధులుగా భావిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.