జనసేన నిర్మాణంలో వీర మహిళల పాత్ర కీలకం

* ఎన్.అర్.ఐ. వీర మహిళలకు పార్టీలో సముచితమైన గౌరవం ఉంటుంది
* జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు

జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతం కోసం వీర మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, జనసేనలో మహిళలకు ఎప్పటికీ గౌరవ ప్రదమైన హోదా ఉంటుందని, ప్రత్యేకంగా ఎన్.అర్.ఐ. వీర మహిళలకు పార్టీలో సముచితమైన స్థానం కల్పిస్తామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. దుబాయ్ దేశం అజ్మాన్ నగరంలోని “దుబాయ్ – యూఏఈ” జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం వీర మహిళలతో శ్రీ నాగబాబు గారు ముఖాముఖి మాట్లాడారు. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పరంగా ఏ కార్యక్రమం చేపట్టినా వీరమహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రణాళికలు, సామాజిక అంశాలకు సంబంధించి వీరమహిళలు వ్యక్త పరచిన ప్రశ్నలు, సందేహాలకు నాగబాబు గారు కూలంకుషంగా వివరణ ఇచ్చారు. ఆస్ట్రేలియా ఎన్.అర్.ఐ. జనసైనికులు, వీరమహిళల సమన్వయకర్త కొలికొండ శశిధర్ జనసేన బలోపేతం కోసం ఎన్.అర్.ఐ. వీరమహిళల పాత్ర అనే అంశంపై మాట్లాడారు. సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ దేశాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కేసరి త్రిమూర్తులు, చందక రామదాసు, కంచన శ్రీకాంత్ నేతృత్వంలోని స్థానిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.