అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలిపిన శ్రీమతి లోకం మాధవి

నెల్లిమర్ల: అంగన్వాడీ వర్కర్లు నాలుగేళ్లగా తీరని సమస్యలపై గత 61 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి లోకం మాధవి గురువారం భోగాపురం ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర అంగన్వాడీ వర్కర్లతో మాట్లాడి ప్రస్తుత ప్రభుత్వం అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా చట్టం ద్వారా ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో తెలుసుకున్నారు. అదేవిధంగా మద్దతు తెలపడమే కాకుండా అంగన్వాడి వర్కర్ల సమ్మె పోరాట నిధికి తన వంతు సహకారం కూడా అందజేయడం జరిగింది. శ్రీమతి లోకం మాధవి మాట్లాడుతూ గత 60 రోజులుగా గ్రామాలలో ఎంతో అవసరమైన అంగన్వాడీ మహిళలుకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, పనికి తగిన పరిహారం అందజేయకుండా ప్రస్తుత ప్రభుత్వం బెదిరింపు చర్యలు పాల్పడడం సరైనది కాదని తెలిపారు. అంగన్వాడీలు చేస్తున్న న్యాయపోరాటానికి జనసేన పార్టీ మద్దతుగా ఉంటదని కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.