వైసీపీ క్లియరెన్స్ సేల్ మొదలుపెట్టింది

• పరిశ్రమల కోసమంటూ భూ కేటాయింపుల్లో అవకతవకలు
• కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన 2,680 ఎకరాల విషయంలో తేడాలు
• హిందూపురంలో అపారెల్ పార్క్ కోసం ఇచ్చిన 350 ఎకరాలు ఇతర అవసరాలకు మళ్లింపు
• చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు కమిటీ అభ్యంతరాలు
• చీఫ్ సెక్రటరీ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి నిర్ణయాలు
• వైసీపీ దుకాణం బంద్ చేసేందుకు సిద్ధమైంది… అందుకే క్లియరెన్స్ కేటాయింపులు
• మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

‘పెట్టుబడులు ప్రోత్సహించి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చామని పదే పదే గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం… క్విడ్ ప్రోకో డీల్స్ తో కొన్ని కంపెనీలకు మాత్రమే అనుచిత లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుంద’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో చేసుకున్న రూ. 13 లక్షల కోట్లు ఎంఓయూలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దుకాణం బంద్ చేసే ముందు క్లియరెన్స్ సేల్ పెట్టి మార్కెటింగ్ చేసినట్లు… తమకు అనుకూలంగా ఉన్నవారికి నిబంధనలతో పని లేకుండా భూములు కట్టబెట్టిందన్నారు. పెట్టుబడుల ఆకర్షణకు స్థిరమైన పాలసీ లేకపోవడంతో నాలుగున్నరేళ్లలో లక్షల కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని, కనీసం రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు… పరిశ్రమలు, పెట్టుబడుల శాఖలో చోటు చేసుకున్న అవకతవకలపై మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ… “వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడానికి భారతదేశంలో అమలవుతున్న ఎస్ఈజెడ్ విధానాన్ని తీసుకొచ్చారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తలకు భూములు ఇచ్చారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పారిశ్రామికవేత్తలను బెదిరించడం, వేధించడం మొదలుపెట్టారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేశారు. వీళ్ల బెదిరింపులు తట్టుకోలేక చాలా మంది పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయిన పరిస్థితి నెలకొంది. పారిశ్రామిక రంగంలో ప్రభుత్వానికి ఒక స్థిరమైన పాలసీ లేకపోవడంతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి క్షీణించింది.
• విఫలమైందని నోటీసులు ఇచ్చిన సంస్థకే మళ్ళీ కేటాయింపులు
కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కోసం 2,680 ఎకరాలు కేటాయిస్తూ అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని కారణాల వల్ల ఆ సంస్థ ప్రాజెక్టును సకాలంలో నిర్మించలేకపోయింది. సకాలంలో నిర్మించనందు వల్ల మీ సంస్థకు కేటాయించిన భూములు వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో… ప్రాజెక్టు నిర్మించలేమని తాము బ్యాంకు గ్యారెంటీగా పెట్టిన రూ. 300 కోట్లు తిరిగి ఇచ్చేయాలని 2016 జనవరిలో ప్రభుత్వానికి ఉత్తరం రాసింది. అయితే భూములు వెనక్కి తీసుకోకుండా అదే సంస్థలో భాగస్వామి అయిన రిలయన్స్ కు కట్టబెట్టింది. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు సమీక్షిస్తుంది. ‘మొదట అల్ట్రా మెగా ప్రాజెక్టు అన్నారు.. ఇప్పుడు గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్, బేస్డ్ పవర్ జనరేషన్ అంటున్నారు. ఇది కరెక్టేనా? కాదా’? అని విద్యుత్ శాఖ సలహా తీసుకోమని స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు స్పష్టంగా చెప్పింది. క్లియరెన్స్ సేల్ లో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి గారు … తాను ఛైర్మన్ గా ఉన్న స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డు ద్వారా చీఫ్ సెక్రటరీ కమిటీ లేవనెత్తిన అభ్యంతరాలను పక్కన పెట్టింది. నవంబర్ 3వ తేదీన క్యాబినెట్ మీటింగ్ లో భూములు రిలయన్స్ కు ఇస్తున్నట్లు ఆమోదం తెలిపింది. ఏ భూమిని అయితే లాగేసుకుంటాం అని చెప్పారో అదే భూమిని కొత్త రాయితీలతో వాళ్లకే కట్టబెట్టారు.
• ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు తిరస్కరించినా ఎందుకు ఆమోదించారు?
అనంతపురం జిల్లా హిందూపురంలో అపారల్ పార్క్ ఏర్పాటు చేయడానికి నియోజన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు వైఎస్సార్ ప్రభుత్వం 350 ఎకరాలు కేటాయించింది. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత భూములు వెనక్కి ఇచ్చేయాలని వెంటపడటంతో వాళ్లు కోర్టుకు వెళ్లారు. ఎస్ఈజెడ్ కింద భూమి ఇస్తే ఈ రోజు దాని వాస్తవ కేటాయింపు తీరు మారుస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అపారల్ పార్కు కాకుండా ఏరో స్పేస్, ఆటో మొబైల్స్, జనరల్ ఇంజనీరింగ్ కోసమంటూ నియోజన్ వాళ్ళు తాజాగా దరఖాస్తు పెట్టుకుంటే ఛీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉన్న స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు తిరస్కరించింది. అపారల్ పార్క్ అయితే ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం కుదురుతుంది. మహిళా సాధికారితకు ఉపయోగపడుతుందని చెప్పి స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు తిరస్కరించింది. ఈ బోర్డు తిరస్కారాన్ని కాదంటూ నవంబర్ 3న క్యాబినెట్ లో నియోజన్ ప్రతిపాదన దరఖాస్తుకు ఆమోదం తెలిపారు. ఎవరికి లబ్ధి చేకూర్చడానికి పాలసీలను మారుస్తున్నారు? భూములు వెనక్కి తీసుకుంటామని చెప్పి ఇప్పుడు వాళ్లకే రాయితీలతో, వాళ్ళు కోరిన విధంగా ఇవ్వడం వెనుక కారణం ఏంటి? స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు తిరస్కరించినా మీరెందుకు ఆమోదించారో ప్రజలకు సమాధానం చెప్పాల”ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బోనబోయిన శ్రీనివాస్, గాదె వెంకటేశ్వరరావు, శ్రీ పోతిన మహేష్, చిల్లపల్లి శ్రీనివాస్, అక్కల రామ్మోహన్ రావు, శ్రీ మల్లినీడి బాబీ, డాక్టర్ పి.గౌతమ్, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, నేరెళ్ళ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.