జనసేనలో చేరిన నక్కలమిట్ట శ్రీనివాసులు

•పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించిన నాదెండ్ల మనోహర్

కర్నూలు, జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. గురువారం హైదరాబాదులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మహిళా సాధికారత రాష్ట్ర చైర్మన్, ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇంచార్జ్ రేఖ జవాజీ ఆధ్వర్యంలో నక్కలమిట్ట శ్రీనివాసులుకి జనసేన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… జనసేన పార్టీ సిద్ధాంతం పట్ల నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానానికి ఆకర్షితులై బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల నుండి పెద్ద ఎత్తున పార్టీలో చేరడం శుభ పరిణామమని అన్నారు. భవిష్యత్తులో కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం కోసం సమిష్టిగా అందరూ కలిసి కృషి చేయాలని నాదెండ్ల మనోహర్ కోరారు. నూతనంగా పార్టీలో చేరిన సీనియర్ బీసీ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం జనసేన పార్టీతోనే సాధ్యమని అన్నారు. కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జనసేన నాయకులు అర్షద్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.