రైతే దేశానికి వెన్నెముక.. రైతు దినోత్సవ వేడుకలలో బండారు శ్రీనివాస్

  • బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకలు
  • దేశాన్ని రక్షించే జవాన్‌లకు ఎంత ప్రాముఖ్యత ఉందో పట్టెడన్నం పెట్టే అన్నదాతలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.. బండారు
  • జాతీయ రైతు దినోత్సవం| రైతన్నలను సత్కరించిన బండారు
  • రైతు అహర్నిశలు కష్టపడితే తప్ప మనం తినే కంచంలోకి అన్నం రాదు

డా. బి.ఆర్ .అంబేద్కర్ కోనసీమ జిల్లా , కొత్తపేట నియోజక వర్గం , జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని కొత్తపేట నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నియోజక వర్గ జనసేన ఇంఛార్జి బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమము ఘనంగా నిర్వహించారు. రైతులకు గౌరవం ఇస్తూ, జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తు, కొత్తపేట స్థానిక సత్యశ్రి థియేటర్ వద్ద గల జనసేన పార్టీ ఆఫీస్ నుండి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి పలివెల చేరుకొని జనసేన నాయకులు జనసైనికులు కలిసి సుమారు 50 మంది రైతులకు దుస్సాలువలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ జన్మదినమైన ,డిసెంబర్‌ 23న రైతు దినోత్సవం జరుపుకుంటారు అని, దివంగత మాజి ప్రధాని చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దై, కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది అని , రైతులకు బ్యాంక్ ఋణాలు అందించే విధానము ప్రవేశపెట్టబడి, రైతుల గురించి, వ్యవసాయరంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేసిన చరణ్ సింగ్ సేవలకు గుర్తుగా ప్రభుత్వము చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది అని బండారు శ్రీనివాస్ అన్నారు. అయితే ఈ రోజు దేశమంతా ఆరోగ్యంగా కడుపు నిండా అన్నం తింటుంది అంటే అది రైతు వల్లే. అలాంటి రైతు ఆరు నెలలు కష్టపడినా, శ్రమ అంతా చేతికి దక్కుతుందనే నమ్మకం లేదు అని, అయినా సరే రైతులు మాత్రం అటు ప్రకృతి మీద, ఇటు ప్రభుత్వం మీద భారం వేసి జీవనం సాగిస్తున్నారు అని అవేదన వ్యక్తం చేశారు. ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అనునిత్యం వెంటాడుతూనే ఉన్న పరిస్థితుల మధ్య అన్నదాతల జీవితాలకు భరోసా లేని పరిస్థితి తెస్తున్నాయి అన్నారు. ఒక రోజు వర్షాల కోసం ,ఇంకోరోజు విత్తనాల కోసం, మరో రోజు ఎరువుల కోసం బ్యాంకు రుణాల కోసం ఇలా ప్రతి విషయంలోనూ ఒత్తిళ్లకు గురి కావాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడుతోంది అని బండారు అన్నారు. ఒత్తిళ్లు, నష్టాలు, వ్యవసాయ పనుల చాకిరీ భరించలేక చాలామంది భూమి ఉన్నా వ్యవసాయం మానేస్తున్నారు అని, కొందరు భూమిని కౌలుకు ఇస్తున్నారు అని, ఎన్నికల్లో పార్టీలు రైతులకు ఎన్ని హామీలిచ్చినా రైతుల పరిస్థితి మాత్రం మారడం లేదు అని అసహనం వ్యక్తం చేశారు. పంటలు సాగు చేసి దిగుబడి రాక అప్పుల బాధలు భరించలేక, సరైన సమయంలో రుణమాఫీ కాక, దిక్కుతోచని స్థితిలో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు అన్నారు . ఇక కౌలు రైతుల పరిస్థితి మరి దారుణంగా ఉంది అని భూమివారిది కాదు, పంట పండితే పూర్తి పంట చేతికి రాదు,వీరికి వ్యవసాయ రుణాలు కూడా రావు,భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడుతున్న వీరి విషయంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు,సొంత భూమి లేకపోవడం, భూమి కౌలుకు తీసుకుంటే ఎక్కువరేట్లు చెల్లించడం, భూమి యాజమాని కాకపోవడం వల్ల పంటరుణానికి ఎవరూ నమ్మడం లేదు అన్నారు. కష్టపడి కాలానికి ఎదురీది పంటలు పండిస్తే దళారులు రైతుల మీద పడి దోచుకోవడం ఇంకా దారుణం అన్నారు మార్కెట్లో తిష్టవేసిన దళారులు రైతుల శ్రమను చౌకగా కొని ఎక్కువ రేట్లకు జనాలకు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు అన్నారు. దీంతో రైతులు కూలీగా మిగులుతుంటే దళారులు లక్షాధికారులు అవుతున్న పరిస్థితులు ప్రతిచోట కనిపిస్తున్నాయి అన్నారు. ఈ దళారుల వ్యవస్థను అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతును రాజుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది బండారు శ్రీనివాస్ అన్నారు. ఇక పంటల విషయంలో రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖలో సిబ్బంది కొరత రైతులను నష్టాలకు గురిచేస్తోంది అని వెంటనే బర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మిద ఉందని అన్నారు. కష్టాలను భరించేలేక ఈ కాలంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని విచారం వ్యక్తం చేశారు. రైతులు ఆలా చేసే ముందు ఒక్కసారి కుటుంబం గురించి ఆలోచించుకోవాలి అని భార్య, పిల్లల పరిస్థితి ఏమిటని ప్రశ్నించుకోవాలి అని సూచించారు, కష్టాలు శాశ్వతం కాదని దేశానికి అన్నం పెట్టే రైతన్నే అధైర్యపడితే ఈ సమాజానికి మెతుకు దొరకదు అని బండారు శ్రీనివాస్ అన్నారు. అందుకే జై జవాన్‌… జై కిసాన్‌ అనే నినాదం యావత్‌ భారత దేశంలో వినిపిస్తుంది. దేశానికి వెన్నుముకగా రైతులను అభివర్ణిస్తారని శ్రీనివాస్ అన్నారు.