నాయకులతో చర్చలు.. జన సామాన్యం నుంచి అర్జీలు
* జనసేన పార్టీ కార్యాలయంలో వరుస సమావేశాలలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంత నాయకులతో వరుస సమావేశాలతో తలమునకలై ఉన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గత నాలుగు రోజుల నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణలోని పార్టీ నాయకులూ, వివిధ విభాగాల్లో ఉన్న యువ నాయకులూ, వీర మహిళలు, కార్యకర్తలతో ముఖాముఖి చర్చించారు. మొత్తం 32 మందితో మాట్లాడారు. తెలంగాణలో ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితులు, ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా పక్షం వహిస్తూ పార్టీ పక్షాన వారు నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో చేపట్టే కార్యక్రమాలను నాయకులూ, శ్రేణులూ పరస్పర అవగాహనతో, సమన్వయంతో చేపట్టాలన్నారు. తదుపరి తెలంగాణాలో చేపట్టబోయే డివిజన్ స్థాయి సమావేశాల నిర్వహణపై ఈ సందర్భంగా చర్చించారు. రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని స్పష్టం చేశారు. ఎన్నికల సన్నద్ధతకు అవసరమైన రాజకీయ శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు కార్యక్రమం రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, జన సామాన్యంతో ముచ్చటించారు. వారి సమస్యలపై అర్జీలు తీసుకున్నారు. విశాఖపట్నం, రాజోలు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులను పలకరించారు. శుక్రవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జులతో భేటీ అయ్యారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, డివిజన్ స్థాయి సమావేశాల నిర్వహణలో ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో ముందుకు వెళ్లడంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.