ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు: సీఎం కేసీఆర్‌

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు అని, నవంబరు 15న వరంగల్‌లో పదిలక్షల మందితో విజయగర్జన సభ నిర్వహించనున్నట్టు తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఆదివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ జరిగింది. సంస్థాగత ఎన్నికలు, సర్వసభ్య సమావేశం, ప్లీనరీపై చర్చించారు. ఈనెల 25 తర్వాత హుజూరాబాద్‌లో కేసీఆర్‌ ఆధ్వర్యంలో సభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలిచితీరుతామని స్పష్టం చేశారు. ప్లీనరీ, విజయగర్జన సభ ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. రెండున్నర ఏళ్లలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. పార్టీ నిర్మాణం గ్రామస్థాయి నుంచి పటిష్టంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.